Year Ender 2025 : కేసీఆర్ కొంప ముంచిన సంవత్సరం, ఇంత డౌన్ ఫాల్ కష్టమే!
కేసీఆర్, బీఆర్ఎస్ ఈ మూడక్షరాలు తెలంగాణ రాజకీయ రూపురేఖల్ని ఎంతగా మార్చాయో దేశమంతా చూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి. తెలంగాణలో ఎదురులేని రాజకీయ శక్తిగా ఎదిగిన వైనం గత దశాబ్ద కాలంలో మనం చూసినదే.. అయితే 2025 సంవత్సరం మాత్రం కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఇంటా, బయట ప్రతికూల పరిస్థితులు, ఆనారోగ్య సమస్యలతో కేసీఆర్ బాగా సతమతమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆశించిన స్థాయిలో కూడా రాణించలేకపోయారు. పార్టీలో ముసలం పుట్టి ఎమ్మెల్యేలు జంప్ అయిన పరిస్థితులు కూడా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాయి. ఇక ఆయన కుమార్తె కవిత కుటుంబానకి, పార్టీకి దూరమయ్యారు.
ఎమ్మెల్యేలు జంప్, రెబల్ గా మారిన కూతురు
2025 సంవత్సరంలో కేసీఆర్ ను కష్టాల్లో ముంచిన సంవత్సరంగా చెప్పవచ్చు. పార్టీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలు 10 మందిలో నలుగురు ఈ ఏడాదే కారు దిగి హస్తం నీడకు చేరారు. అయితే వీరిపై చర్యలు తీసుకోవాలని పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నారు కేసీఆర్. సుప్రీం కోర్టు వరకు వెళ్లినా ఆశించిన స్థాయిలో ఆ కేసులో స్పీడ్ లేదనే బయట టాక్ నడుస్తుంది. మరో వైపు వేరు కుంపటి పెట్టడానికి సిద్ధమై.. కంట్లో నలుసులా మారారు కవిత. రెబల్గా మారి పార్టీ నుంచి బయటకు వచ్చి. పదేళ్ల పాలనపై విచారణ చేయిస్తానని హెచ్చరించి కన్న తండ్రికే ఊహించని షాక్ ఇచ్చారు ఆమె. కవిత టార్గెట్ వేరు, కానీ బలవుతుంది మాత్రం కేసీఆరే.

ఆందోళన కలిగిస్తున్న ఆరోగ్యం
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదనే టాక్ బీఆర్ఎస్ వర్గాల్లోనే ఎక్కువగా వినిపిస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే ఆయన పరిమితమై అవసరమైనప్పుడు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఫామ్ హౌస్ నుంచే పార్టీ కార్యకలాపాలు అన్ని నిర్వహిస్తున్నారు. నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బాధ్యతలు అన్ని కేటీఆర్ కు అప్పగించి కొంచెం బరువు దించుకునే ప్రయత్నం చేసినా.. మేడిగడ్డ బ్యారేజ్ కుంగటం, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు పిలవడమే కాదు.. కేసులు కూడా తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక, ఫార్ములా -ఈరేస్ వ్యవహారంలో ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారని.. అక్రమంగా కట్టబెట్టి కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు కేటీఆర్ను చుట్టుముట్టాయి. ఈ టెన్షన్ తోనే కేసీఆర్ ఆరోగ్యం దెబ్బతింటుందని గులాబీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీకి అలా వచ్చి, ఇలా వెళ్లిపోతున్నారు.
2025-26 బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తొలిరోజు ఒకసారి మాత్రమే సభకు వచ్చారు కేసీఆర్. అప్పుడు కూడా చాలా తక్కువ సమయం మాత్రమే ఆయన సభలో కనిపించారు . తర్వాత తన మొహం కూడా అసెంబ్లీకి చూపలేక పోయారు. తాజాగా నేడు జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు అసెంబ్లీకి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చి నమస్కారం చేసి వెళ్లడం వైరల్ గా మారింది.
ఒకే ఒక్క పబ్లిక్ మీటింగ్, ప్రెస్ మీట్
జల వివాదాల నేపథ్యంలో నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఫిబ్రవరి మధ్యలో నిర్వహించిన ఈ సభ తర్వాత కేసీఆర్ మళ్లీ ఎక్కడా ప్రజల్లో ఎక్కడా కనిపించలేదు. మరో వైపు తమ మాటలతో ఎవరినైనా సరే రోస్ట్ చేయడం కేసీఆర్ నైజం. రెండేళ్ల తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఈజ్ బ్యాక్ అనే యాంగిల్ బాగానే వినిపించేలా చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయి.. బీఆర్ఎస్ శ్రేణుల్ని డిసప్పాయింట్ చేశారు
జూబ్లీహిల్స్ బై పోల్, పంచాయతీ ఎన్నికలు
ఇక ఈ ఏడాది బీఆర్ఎస్ రెండు ప్రధాన ఎన్నకలను ఎదుర్కొంది. మాగుంట గోపినాథ్ మృతితో సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ను చేజార్చుకుంది బీఆర్ఎస్. ఎలాగైనా తిరిగి గెలుచుకోవాలని అనుకున్నా తెలంగాణ సాధకుడికి అది సాధ్యపడలేదు. మరో వైపు పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే ఫర్వాలేదన్నట్టుగా పరువు నిలబెట్టుకుంది. ఎలా చూసుకున్నా కేసీఆర్ కు 2025 భంగపాటనే మిగిల్చిందనే చెప్పాలి.












Click it and Unblock the Notifications