కేసీఆర్.. మునుగోడులో మూడుచెరువుల నీళ్ళు తాగించటం పక్కా: కొండా సురేఖ హెచ్చరిక!!
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడిని పుట్టిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు మునుగోడు లో పాగా వేయాలని, జెండా ఎగురవేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా టిఆర్ఎస్ పార్టీ నేటి ప్రజా దీవెన సభ ద్వారా మునుగోడుపై పట్టు సాధించడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. నేటి నుండి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టిన టిఆర్ఎస్ పార్టీ అందులో భాగంగా సీఎం కేసీఆర్ తో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభ ద్వారా కేసీఆర్ మునుగోడులో ప్రజా మద్దతు పొందడం కోసం ప్రయత్నం చేయనున్నారు.

మునుగోడులో సీఎం కేసీఆర్ సభ.. టార్గెట్ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్
అయితే మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్ ను ఆదరించరని, మునుగోడుకు కేసీఆర్ చేసిందేమీ లేదని ప్రతిపక్ష పార్టీల నేతలు ఇప్పటికే కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతోనే కేసీఆర్ మునుగోడుపై దృష్టి పెడుతున్నారని, ఓట్ల రాజకీయాలలో భాగంగా మునుగోడుకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తారని బీజేపీ నేతలు చెబుతుంటే, అసలు నల్గొండ జిల్లాలో కెసిఆర్ చేసింది ఏమీ లేదని, నాడు తెలంగాణ ఉద్యమంలో నలిగిపోయిన ఉద్యమకారులు ఈరోజు సీఎం కేసీఆర్ కు మూడు చెరువుల నీళ్లు తాగించడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

కేసీఆర్ పై ధ్వజమెత్తిన కొండా సురేఖ .. ఉద్యమ ద్రోహి అంటూ ఫైర్
ఇక ఎంతో కాలంగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ, కెసిఆర్ దొర పాలనకు చరమగీతం పాడాలని పదేపదే చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొండా సురేఖ, తాజాగా సీఎం కేసీఆర్ ప్రజా దీవెన సభ నేపథ్యంలో మరోమారు కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఉద్యమ ద్రోహి కెసిఆర్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరించేది లేదని కొండ సురేఖ తేల్చిచెప్పారు.
ఉద్యమకారులను నలిపేసిన చరిత్ర నీది కేసీఆర్: కొండా సురేఖ
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో నల్లగొండ జిల్లా వాసులది నాడు నలిగిపోయిన చరిత్ర అని కొండా సురేఖ పేర్కొన్నారు. అధికారం వచ్చాక ఉద్యమకారులను నలిపేసిన చరిత్ర నీది.. అంటూ కొండా సురేఖ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ఆనాడు నీ విషపు కోరల్లో బందీ అయినారు, కానీ నేడు మునుగోడులో నీకు మూడు చెరువుల నీళ్లు తాగించడం పక్కా కెసిఆర్ అంటూ కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇదేనా కెసీఆర్ ఆరోగ్య తెలంగాణా.. మునుగోడు ఆస్పత్రి దుస్థితిపై కొండా సురేఖ
అంతేకాదు ఒక్కడంటే ఒక్కడే ఔట్సోర్సింగ్ వైద్యుడు, ఆరంటే ఆరే పడకలు, మునుగోడు లో ప్రభుత్వ వైద్య దుస్థితి ఇదీ అంటూ మండిపడిన కొండా సురేఖ, రోగులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న కేసీఆర్, ఇదేనా ఆరోగ్య తెలంగాణ అంటూ నిలదీశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటూ మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో మన మునుగోడు మన కాంగ్రెస్ అంటూ పేర్కొన్న కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారని, కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications