వక్భ్ భూములను మంత్రి గంగుల కమలాకర్ కబ్జా చేశారు: బీఆర్ఎస్కు అహ్మద్ ఖాన్ రాజీనామా
కరీంనగర్: మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్పై ఆ పార్టీ నేత, కరీంనగర్ వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ మొహసిన్ అహ్మద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేగాక, ముస్లింలకు అన్యాయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
'ఖాజీపూర్ గ్రామంలోని 54 ఎకరాల వక్ఫ్ బోర్డ్ భూములు కబ్జా, రేకుర్తి గ్రామంలో పేద ముస్లింల 35 ఇండ్లను బుల్డోజర్ల ద్వారా ధ్వంసం చేయడం.. అన్యాయంగా వీరిపై అక్రమ పోలీస్ కేసులు బనాయించడం.. 15 సంవత్సరాలుగా కరీంనగర్లో ముస్లింలకు చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను' అని మొహసిన్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రజాదరణ వల్లే ఆరోపణలు: కరీంనగర్లో గంగుల కమలాకర్ విస్తృత ప్రచారం
కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తూ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రంలో మళ్లీ చిమ్మ చీకట్లేనని.. ఎవరెన్నీ కుట్రలు పన్నినా కరీంనగర్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండేనని కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 17,18,19 డివిజన్లలో కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థించారు గంగుల కమలాకర్. డివిజన్ వాసులు ఆయనకు పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి ఓటర్లు మోస పోవద్దన్నారు. ప్రజల నుంచి బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయన్నారు.
ఎన్నికల సమయంలో వారు చెప్పే మాటలను ప్రజలు నమ్మి మోస పోవద్దన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాల అసమర్థ పాలనతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దూరం చేయడానికి అనేక బృహత్తర పథకాలు అమలు చేశామని, వాటిని దిగ్విజయంగా అమలు చేయడంతోనే ప్రజలు నుంచి విశేష స్పందన లభిస్తోందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గంగుల కమలాకర్.












Click it and Unblock the Notifications