విద్యార్థిని చెప్పుతో కొట్టిన లెక్చరర్: అందరి ముందు క్షమాపణ
మెదక్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు విద్యార్థిని చెప్పుతో కొట్టిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారంలో బుధవారం నాడు వెలుగు చూసింది. కొల్చారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ దారుణ సంఘటన జరిగింది.
ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి అశోక్ను ఫిజిక్స్ లెక్చరర్ యాదాగౌడ్ మంగళవారం సాయంత్రం చెప్పుతో ఐదు దెబ్బలు కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి తీవ్ర అవమానభారానికి గురై అంసాన్పల్లిలోని ఇంటికి చేరుకుని మంగళవారం రాత్రి అన్నం తినలేదు.
ఇంట్లో అందరూ నిద్రించాక ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు చూడటంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బుధవారం నాడు కళాశాలకు వచ్చి లెక్చరర్ను నిలదీశారు.

తాను విద్యార్థిని చెప్పుతో కొట్టిన మాట వాస్తవమేనని చెప్పాడు. అందరి సమక్షంలో సదరు లెక్చరర్ క్షమాపణ కోరాడు. విద్యార్థి తండ్రి ఎల్లప్ప, తల్లి సత్తెమ్మ, అక్క సుగుణలు లెక్చరర్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని అక్కడి నుంచి వచ్చారు. కాగా, కళాశాల పైభాగంలో ఆడుతుండటంతో ప్రమాదం జరిగే అవకాశముందని భావించి కొట్టినట్లు చెప్పాడు.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా పటాన్ చెరువు మండలం బిడిఎల్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. నల్గొండకు చెందిన హృత్విక్ నందన్ రెడ్డి నారాయణ ఐఐటీ క్యాంపస్లో ఇంటర్ చదువుతున్నాడు. హాస్టల్లో ఉంటున్నాడు.
బుధవారం సాయంత్రం గది నుంచి విద్యార్థులు అంతా కిచెన్కు వెళ్లారు. నందన్ రెడ్డి లేకపోవడాన్ని స్నేహితులు గుర్తించారు. గదిలోకి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. వైస్ ప్రిన్సిపల్ ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications