మధుప్రియ జీవితంలో ట్రాజెడీ మొదలు, నన్ను అడగలేదు: తండ్రి
నిజామాబాద్: గాయని మధుప్రియ జీవితంలో ట్రాజెడీ ప్రారంభమైందని, ఓ కన్న తండ్రిగా తన బాధ అదేనని ఆమె తండ్రి మల్లేష్ వాపోయారు. ఆయన ఓ టీవీ ఛానల్ ప్రోగ్రాంలో మాట్లాడారు. తనను అడిగి ఉంటే తామే దగ్గర ఉండి వివాహం చేసేవాళ్లమన్నారు.
తండ్రికి గుండె నొప్పి వచ్చిందని చెప్పినా మధును వాళ్లు పంపించలేదని, ఇక జీవితంలో ఆమె మాటకు విలువ ఇస్తారని ఎలా భావించాలని వాపోయారు. ఆమె జీవితంలో ట్రాజెడీ ప్రారంభమైందని, కన్నతండ్రిగా అదే తన బాధ అన్నారు.
ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేయమన్నా తాను అంగీకరిస్తానని తన కూతురు మధుప్రియకు తాను చెప్పానని, కానీ శ్రీకాంత్ తన వద్దకు వచ్చి మీ కూతురును పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ అడగలేదన్నారు. నిజంగా ప్రేమించిన వాడే అయితే తన వద్దకు వచ్చి ఎందుకు అడగలేదని వాపోయారు.
మార్చి 18వ తేదీన వివాహం జరిపిస్తామని చెప్పినా వినలేదన్నారు. శ్రీకాంత్ మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయన్నారు. తన బిడ్డ మధుప్రియను తన తల్లిగా చూసుకున్నానని, శ్రీకాంత్ మోసగాడన్నారు. కాగా, తన తల్లిదండ్రులను తాను ఎప్పటికైనా కలుస్తానని మధుప్రియ చెబుతోన్న విషయం తెలిసిందే. మధుప్రియ, శ్రీకాంత్ల పరిచయం కొద్ది నెలల క్రితమే అయిందని తెలుస్తోంది.
శ్రీకాంత్ - మధుప్రియల వివాహం శుక్రవారం నాడు జరిగిన విషయం తెలిసిందే. హైడ్రామా మధ్య వారి వివాహం జరిగింది. వీరి పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కాగజ్ నగర్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మధుప్రియ.. శ్రీకాంత్నే పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది. దీంతో, తల్లిదండ్రులకు నచ్చచెప్పి పోలీసులు వారి వివాహం జరిపించారు.