మైలార్దేవ్పల్లి విషాదం: 8 మంది కుటుంబసభ్యుల్లో నలుగురి మృతదేహాలు లభ్యం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో అలీనగర్లో బుధావరం సాయంత్ర వరదనీటిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతయ్యారు. గురు, శుక్రవారాల్లో వారిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అబ్దుల్ తాహిర్ కుటుంబానికి చెందిన 8 మంది ఇంటి అరుగుపై కూర్చున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరదనీటి ఉధృతిలో కొట్టుకుపోయారు.
కాగా, గురువారం రాత్రి రెండు మృతదేహాలను ఫలక్నుమా సమీపంలోని నాలాలో గుర్తించగా, మరో రెండు మృతదేహాలు శుక్రవారం ఉదయం లభ్యమయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలిక ఉన్నారు. మరో నాలుగు మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల గల్లంతైనవారిని గుర్తించడంలో ఆలస్యం జరుగుతోంది.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ తోపాటు పరిసర జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు జలమయమయ్యాయి. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. 300 కుటుంబాల వరకు సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ.. ఇంకా అనేక మంది వరద నీటిలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సందర్శనకు వచ్చే ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం ప్రకటించిన కేసీఆర్
ఇది ఇలావుండగా, గురువారం హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా కురిసన భారీ వర్షాలు, వరద ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తరపున ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు, 3 దుప్పట్లు వెంటనే అందించాలని కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం రూ. 5 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు.
Recommended Video
వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 మంది మృతి చెందారని, మృతుల్లో హైదరాబాద్ పరిధిలోనే 11 మంది ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్తిక సాయం అందించాలని, ఇల్లు పూర్తిగా కూలిపోయినవారికి కొత్తగా మంజూరు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందించాలన్నారు.