ఒళ్లంతా కాలింది: ఇంట్లో నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించారు
హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ఐడీఏ బొల్లారం బాలాజీ నగర్లో దారుణం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ ఇంట్లో అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు. ఇల్లంతా పెట్రోల్ వాసన, చుట్టూ కమ్మేసిన పొగలు, ఆ తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బయటడే మార్గం లేకపోవడంతో కాపాడండంటూ పెద్దగా అరుపులు వేశారు.
అయితే చుట్టు పక్కనున్న ఇళ్లకు బయట గడియ పెట్టడంతో స్థానికులు సైతం వారిని రక్షిచంలేకపోయారు. చివరకు ఎలాగోలా సాయం అందించేలోపే మంటలు చుట్టుముట్టడంతో ఇంట్లోనే ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
పోలీసులు కథనం ప్రకారం... ముప్పై ఏళ్ల క్రితం జగన్నాథం సుంకయ్య కుటుంబం కర్ణాటక నుంచి వలస వచ్చింది. వీరంతా పందుల పెంపకంతో ఉపాధి పొందుతున్నారు. కుటుంబ యజమాని సుంకయ్యకు ఇద్దరు భార్యలు ఐదుగురు కుమారులు. పెద్ద భార్య పోచమ్మ అనారోగ్యానికి గురవడంతో సునీతను రెండో వివాహం చేసుకున్నాడు.
వీరికి ముగ్గురు మగపిల్లలు. సుంకయ్య సెప్టిక్ట్యాంక్ క్లీనింగ్ వాహనం ఏజెంట్గా కూడా పనిచేసేవాడు. తనకు తోడుగా దూరపు బంధువైన రాజును నియమించుకున్నాడు. రెండేళ్ల క్రితం నగదు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రాజు కత్తితో సుంకయ్య మెడ నరికేందుకు ప్రయత్నించాడు.
దీంతో మధ్యలో కలగజేసుకుని స్థానికులు విడదీయటంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘర్షణలో సుంకయ్య కుటుంబాన్ని సజీవదహనం చేస్తానంటూ రాజు హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు సుంకయ్య ఇంట్లోకి కిటికీ గుండా పెట్రోలు పోసి నిప్పటించారు.
ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తున్న సుంకయ్య, సునీత, కుమారులు వీరన్న (5), క్రిష్ (3), దానియల్ (13నెలలు) తీవ్రంగా గాయపడ్డారు. మంటల్లో చిక్కుకుని పెద్దగా అరుపులు వేస్తోన్న సుంకయ్య ఇంటి తలుపులను సమీపంలో ఉండే జితేందర్ అనే వ్యక్తి ధైర్యం చేసి తలుపులు బద్దలు కొట్టాడు.
అనంతరం వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుంకరయ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదంలో గాయపడిన మిగతా నలుగురు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు పేర్కొన్నారు.
పాతకక్షలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. తమకు దూరపు బంధువైన రాజు అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడని సుంకయ్య భార్య సునీత పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.