ఆ నియోజకవర్గంలో సిట్టింగ్నే నమ్ముకున్న కేసీఆర్: సీటు ఖరార్
KCR: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి గేరు మార్చింది. దశలవారీగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ వస్తోంది. ఇప్పటికే నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది.
తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఈ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని, మరిన్ని అధిక లోక్సభ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయ భారాన్ని లోక్సభ బరిలో విజయంగా మలచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.
ఈ క్రమంలో కరీంనగర్- బీ వినోద్ కుమార్, పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్- మాలోత్ కవిత అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా మరో నియోజకవర్గానికి అభ్యర్థి పేరును ఖరారు చేశారాయన.
మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పేరును ఖాయం చేశారు కేసీఆర్. మన్నె శ్రీనివాస్ రెడ్డికే మరోసారి అవకాశాన్ని ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇదివరకే తన అభ్యర్థిని పేరును వెల్లడించిన విషయం తెలిసిందే. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిని బరిలో నిలిపింది.
బీఆర్ఎస్కు ప్రతిష్ఠాత్మకం మహబూబ్నగర్ లోక్సభ. 2009 తరువాత ఎప్పుడూ ఓడిపోలేదు. 2009లో కేసీఆర్, 2014లో జితేందర్ రెడ్డి విజయం సాధించారు. 2019లో మన్నె శ్రీనివాసరెడ్డి విజయఢంకా మోగించారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణను 77 వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు.
ఈ సారి మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొనడం ఖాయంగా కనిపిస్తోంది. మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో ఉండే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ జెండా పాతడమే దీనికి కారణం. కొడంగల్, నారాయణపేట్, మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు లోక్సభ బరిలో పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications