అడవిలోకి తీసుకెళ్లి మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక దాడికి యత్నం: మరిపెడ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
మహబూబాబాద్: ఓ మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులు జిల్లాలో కలకలం రేపాయి. మరిపెడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ మహిళా ట్రైనీ ఎస్ఐ వరంగల్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు
తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు సీపీని కోరారు. సోమవారం రాత్రి తనను అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారంటూ ట్రైనీ ఎస్ఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం జరగకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ వాపోయారు.

ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశారు. వరంగల్ ఐజీ నాగిరెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మహిళా ట్రైనీ ఎస్ఐపై శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా విచారణలో రుజువైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ తరుణ్ జోషీ తెలిపారు.
కాగా, మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలోని మహిళలకే రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మహిళా ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నం ఘటనను నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు డీజీపీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు నేతలు వెళ్లగా.. పోలీసులు డీజీపీ కార్యాలయం గేట్లు మూసివేశారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నేతలు అక్కడే ధర్నాకు దిగారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావ్ తోపాటు పలువురు మహిళలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
యువతి హత్య: ప్రియుడే హంతకుడు
హైదరాబాద్ నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీహెచ్ఈఎల్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ప్రియుడే ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
వివరాల్లోకి వెళితే.. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరస్వతి(18) తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, మంగళవారం ఉదయం స్థానికులకు సరస్వతి మృతదేహం రైల్వే ట్రాక్పై కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మృతదేహం సరస్వతిదిగా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. దీపక్ అనే యువకుడిపై బాధితురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు దీపక్ తానే హత్య చేసినట్లు పోలీసులు ముందు అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications