'వధువు' కోసం వెతుకుతున్నారా?, జాగ్రత్త.. ఇలా దెబ్బయిపోకండి!
కొంతమంది టెలీకార్లను నియమించుకుని.. వారినే పెళ్లి కూతుళ్లుగా చూపిస్తూ దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు.
హైదరాబాద్: డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్స్ వెతికేవాళ్లందరు.. ఎప్పుడు ఎవరిని బుట్టలో వేసుకుందామా? అన్న ఆలోచనలోనే ఉంటారు. ఆలోచనను ఆచరణలో పెట్టి అమాయకులకు గాలం వేసే ప్రయత్నం చేస్తారు. ఇంకేముంది వారి మోసపు మాటలను పసిగట్టని అమాయకులు జేబులు గుల్ల చేసుకోవడమే తరువాయి.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఈమధ్య కాలంలో మ్యారేజీ బ్యూరోలను ఉపయోగించుకుని పెళ్లి పేరుతో చాలానే మోసాలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలోని వనస్థలిపురంకు చెందిన సునీల్ అనే వ్యక్తి ఓ మ్యారేజీ బ్యూరో చేతిలో మోసపోయాడు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో ఈ మ్యారేజీ బ్యూరో గుట్టు రట్టయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పేరుకేమో అది 'న్యూ లైఫ్' మ్యారేజ్ బ్యూరో. కొంతమంది టెలీకార్లను నియమించుకుని.. వారినే పెళ్లి కూతుళ్లుగా చూపిస్తూ దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. పలానా వధువుకు వరుడు కావాలని.. వధువుకు సాలీనా ఆమెకు సాలీనా రూ. 14 లక్షల వేతనం వస్తుందని, సొంత ఇల్లు, 10 ఎకరాల పొలం, 10 ఎకరాల కొబ్బరితోట, రూ. 6 కోట్ల ఆస్తి ఉందని, మధ్య తరగతికి చెందిన వరుడు కావాలని ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు.
వనస్థలిపురంకు చెందిన సునీల్ ను ఈ ప్రకటన బోల్తా కొట్టించింది. ప్రకటనలో ఇచ్చిన వివరాల ప్రకారం మ్యారేజీ బ్యూరో వారిని సునీల్ ఫోన్ ద్వారా సంప్రదించాడు. దీంతో సునీల్ కు ఒక తప్పుడు ప్రొఫైల్ చూపించి రూ.3వేలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకున్నారు.
అనంతరం తమవద్ద టెలికాలర్ గా పనిచేస్తున్న అమ్మాయితో ఫోన్ చేయించి అతడిని నమ్మించే ప్రయత్నం చేశారు. సదరు అమ్మాయి వారంలోగా కలుద్దామని సునీల్ కు మాటిచ్చింది. ఆపై సునీల్ ఆ అమ్మాయి నంబర్ కి ఎంత ప్రయత్నించినా.. ఆమె స్పందించలేదు. దీంతో తాను మోసపోయినట్టు గుర్తించిన సునీల్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు ఎస్ వాసవి, వి లక్ష్మీదేవి అనే మహిళలను అరెస్ట్ చేశారు. నిందిత మహిళలు గతంలోనూ ఇదే విధంగా పలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేసినట్టు తేల్చారు.