నీకు పెళ్లెందుకురా.. వేస్ట్: యువకుడితో అమ్మాయి ఫేస్బుక్ గొడవ
హైదరాబాద్: ఇద్దరు యువతీ యువకుల మధ్య పెళ్లి కానుక తంటా తీసుకు వచ్చింది. ఇది వ్యక్తిగత ద్వేషానికి కారణమైంది. యువకుడి పెళ్లి సందర్భంగా యువతి వ్యంగ్యాస్త్రాలు విసరగా, ఆమె పైన ఫేస్బుక్లో యువకుడు అసభ్యరాతలు రాశాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
సాధారణంగా ఇద్దరు విద్యార్థులు చదువుల్లో పోటీ పడుతుంటారు. ఆరోగ్యకరమైన పోటీ ఉంటే పరవాలేదు. అనారోగ్యకరమైన పోటీ ఉంటేనే ఇబ్బంది. గుంటూరుకు చెందిన ఇద్దరు అబ్బాయి, అమ్మాయి మాత్రం చదువులో పోటీ పడుతుంటారు. వీరి మధ్య చదువు వ్యక్తిగత ద్వేషానికి దారి తీసింది.
ఆ యువకుడి పెళ్లికి ఆమె బహుమతితో పాటు పంపిన లేఖ ఇద్దరి మధ్య గొడవను పెంచింది. గుంటూరుకు చెందిన సాయికృష్ణకు చిన్నప్పటి నుంచి తన తోటి విద్యార్థినితో చదువులో పోటీ ఉంది. ఇద్దరు ఒకరిని మరొకరు దూషించుకునేవారు. కాలేజీస్థాయికి వచ్చినా వారి మధ్య వైరం కొనసాగింది.
మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన సాయికృష్ణ ఇటీవలే తనతో పోటీ పడుతున్న అమ్మాయి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. అథడిని చేసుకున్న యువతి.. ఆమెను కూడా పెళ్లికి పిలిచింది. అయితే సాయికృష్ణతో వైరం కారణంగా ఆమె పెళ్లికి రాలేదు. కానీ బహుమతి పంపించింది.
అందులో 'నీకెందుకురా పెళ్లి.. వేస్ట్' అని రాసింది. అది చూసిన సాయికృష్ణ 'నువ్వు గిఫ్ట్ ప్యాక్ పైన లేబుల్ అంత చేయవు' అన్నాడు. అతను ఫేస్బుక్లో ఆమె పైన అసభ్య రాతలు రాశాడు. దీంతో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాయికృష్ణను అరెస్టు చేశారు.
కాగా, అతను గతంలోను ఆమెను దూషించేవాడని తెలుస్తోంది. అథని తిట్లకు అంతులేకుండా పోవడంతో అమ్మాయి ఏకంగా ఊరు విడిచిపెట్టి హైదరాబాదుకు వచ్చింది. హైదరాబాద్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ కామెంట్లతో ఆమెను టార్గెట్ చేశాడు. అయితే, తనకు పంపిన గిఫ్టు ప్యాక్లో తిట్ల పురాణం ఉండటంతో సాయికృష్ణ తట్టుకోలేక ఫేస్బుక్లో తాజాగా కామెంట్లు చేశాడు.
గతంలో.. ఫేస్బుక్లోకి వెళ్లి యువతి ఆన్లైన్లో ఉన్నప్పుడు, ఆఫ్లైన్లోనూ చాటింగ్ చేస్తూ తిట్ల దండకం అందుకునే వాడట. అతడి తిట్లకు భయపడి ఆమె గుంటూరు నుంచి హైదరాబాద్కు మకాం మార్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు.