మీరు తెరాస వాళ్లు కాదు, మీ పని చేయం!: మంత్రి
ములుగు: ఊరంతా తమకు వ్యతిరేకంగా ఉన్నారని, మీరు మాకు ఏం చేశారని మీకు పని చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి అజ్మీరా చందూలాల్ ఓ గ్రామ ప్రజలను ఉద్దేశించి అన్నట్లుగా వచ్చిన వార్తలు కలకలం రేపాయి. ములుగులోని కన్నాయిగూడెం గ్రామస్థులతో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
మీరు మాకు ఏం సహకారం చేశారని, మీకు ఎందుకు పని చేయాలని, ఈ రోడ్డు పని ఒక సంవత్సరం దాకా కాదని, మీ ఊరు ఎప్పుడూ మాకు చేయి ఇచ్చిందని, అందరు కలిసి వచ్చిన నాడు పని మొదలుపెడతామని గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ కన్నాయిగూడెం ప్రజలను ఉద్దేశించి అన్నారు.
ఆయన మంగళవారం వరంగల్ జిల్లా ములుగు మండలంలో పర్యటించారు. కాసిందేవీపేట నుండి కన్నాయిగూడెం రోడ్డు శంకుస్థాపన కోసం కన్నాయిగూడెం వచ్చారు. గ్రామానికి రాగానే... ఊరివారందరినీ పిలుచుకున్నారు. మాటల మధ్యలో... ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో మేం తెరాసకే ఓటు వేశామని గ్రామస్థులు చెప్పారు. దీనిపై మంత్రి ఘాటుగా సమాధానమిచ్చారు. అబద్దాలు ఆడవద్దని, డబ్బా ఇప్పి చూపిస్తానని, డబ్బా లెక్కలు నా దగ్గర ఉన్నాయని వ్యాఖ్యానించారని సమాచారం. సింగిల్ విండో ఎన్నికల్లో మా పార్టీ తరఫున డైరెక్టర్ను ఉపసంహరించుకున్నామని, గెలిచిన డైరెక్టర్ను ఎవరికి అమ్ముకున్నారని ప్రశ్నించారు.
ఊరు నుండి సహకారం ఉంటేనే మేం చేస్తామని, లేకుంటే మేం ఎందుకు చేయాలని ప్రశ్నంచారని తెలుస్తోంది. నేను వేయించిన మంచినీళ్ల బోరు తప్ప ఎవరైనా మీకు చేశారా అని నిలదీశారు. ఈ రోడ్డు సంవత్సరం తాగా కాదని చెప్పారు. ఊరంతా వచ్చి మాట్లాడాలన్నారు.