తెలంగాణలో 'రైస్ స్కూల్స్' : అమెరికాలో కేటీఆర్ ప్రయత్నాలు
అయోవా : అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయమై బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే, తెలంగాణలో 'రైస్ స్కూల్స్' ను ఏర్పాటు చేసి రాష్ట్ర రైతంగాన్ని ఆధునిక సాంకేతిక వ్యవసాయంతో అనుసంధానం చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిష్టాత్మక విత్తన పరిశోధన సంస్థ అయిన డ్యూపాంట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు కేటీఆర్.
సీఎం కేసీఆర్ 'సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ' ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఈ రైస్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఈ క్రమంలోనే డ్యూపాంట్ సంస్థలను తెలంగాణలోను నెలకొల్పాలని సంస్థ అధికారులను కోరిన కేటీఆర్, తద్వారా రాష్ట్ర రైతంగానికి నూతన ఆదర్శ వ్యవసాయ విధానాలను పరిచయం చేయాలనే యోచనలో ఉన్నారు.
అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ లో రాష్ట్ర రైతంగానికి డ్యూపాంట్ మార్గదర్శకాలు అవసరమని ఆ దిశగా డ్యూపాంట్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరారు. కేటీఆర్ విజ్ఞప్తుల మేరకు డ్యూపాంట్ సంస్థ సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం.
డ్యూపాట్ సంస్థతో భేటీకి ముందు మంత్రి కేటీఆర్ అయోవా రాష్ట్రంలో పర్యటించారు. అక్కడి గవర్నర్ టెర్రీ బ్రౌనస్టర్ట్ తో పాటు పలు సంస్థలు, పరిశ్రామిక వేత్తలతో సమావేశమైన కేటీఆర్.. ఆధునిక వ్యవసాయ పద్దతులు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్సూరెన్సు, రైస్ స్కూల్స్, వంటి అంశాల గురించి చర్చించారు.
కాగా వ్యవసాయం, బీమా రంగంలో అయోవా రాష్ట్రం అపూర్వమైన ప్రగతి సాధించింది. అందుకే అయోవా రాష్ట్రం నుంచి వ్యవసాయ పెట్టుబడులతో పాటు, ఆధునిక వ్యవసాయానికి సంబంధించిన లాభసాటి విధానాలపై కేటీఆర్ అధ్యయనం చేశారు. సమావేశంలో భాగంగా.. వ్యవసాయంలో రసాయనాల వినియోగానికి తక్కువ ప్రాధాన్యతనిస్తూ, యాంత్రీకరణకు పెద్ద పీట వేయడం ద్వారా అక్కడి వ్యవసాయం లాభసాటిగా మారిందని అయోవా గవర్నర్ తెలిపారు.
డ్యూపాంట్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం సందర్భంగా.. తెలంగాణలో బయో సైన్స్ రంగంలో పెట్టుబడులకు సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. దీంతో అయోవా రైతంగానికి ఇచ్చిన మార్గదర్శకాల లాగే, తెలంగాణ రైతంగానికి కూడా సహకారం అందించాల్సిందిగా కోరారు.
సమావేశం అనంతరం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలోను అయోవాలోని ప్రముఖులు, ఆయా సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆహార బహుమతి (వరల్డ్ ఫుడ్ ప్రైజ్) సంస్థ అధ్యక్షుడు కెన్నెత క్వీన కూడా పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడిన మంత్ర కేటీఆర్, పారిశ్రామిక అభివృద్ధితో పాటు, రాష్ట్రంలో ఎక్కువ మంది ఆధారపడ్డ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం అయోవా రాష్ట్ర విధి విధానాలు తెలంగాణకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయని పేర్కొన్నారు.
బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) లాంటి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ తమ బ్రాంచ్ లను ఏర్పరుచుకున్నాయని చెప్పిన మంత్రి కేటీఆర్, నగరానికి మరిన్ని ఇన్సూరెన్సు, నాన బ్యాంకింగ్ సేవల సంస్థలు తీసుకువచ్చేలా అయోవా రాష్ట్రం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.