ఎక్కడైనా సిద్దం.. హరీశ్ రావుకు మంత్రి వాకిటి శ్రీహరి మాస్ కౌంటర్ !
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి వాకిటి శ్రీహరి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. బనకచర్లపై ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో హరీశ్ రావే తడబడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చేపల పులుసు తినడానికి రాయలసీమకు వెళ్లి.. రాయలసీమను రత్నాలసీమగా మార్చుతానని చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు.
ఈ మేరకు ఈరోజు ( జూలై 2, 2025 ) హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అందుతున్నాయని తెలిపారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా ధరణి బాధితుల సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం పలు శాఖల అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అంతే కాకుండా మంత్రి ఇంకా మాట్లాడుతూ.. కృష్ణా నది జలాలపై వచ్చే వారం ప్రత్యేకంగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే బీజేపీపై కూడా శ్రీహరి విమర్శలు గుప్పించారు. బీసీల పట్ల బీజేపీ పార్టీ అవలంబిస్తున్న పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండించారు. కులగణన సర్వే జరిగిన తర్వాత కూడా బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందని.. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కూడా ఆ పార్టీ మొసలి కన్నీళ్లు కారుస్తోంది అంటూ ధ్వజమెత్తారు.
అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ప్రతి బుధవారం 'ముఖాముఖి కార్యక్రమం' నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా మంత్రులను కలసి తమ సమస్యలు చెప్పగలుగుతున్నారని.. ఇది కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమవుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications