ఎమ్మెల్సీ ఎన్నికలు: ప్రధాన పార్టీలకు చిన్న పార్టీల సెగ
హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తెలంగాణ రాష్ట్రాన్ని తాకింది. ప్రధాన పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), కాంగ్రెసు పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎత్తులు జిత్తులు వేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర నాయకులతో సోమవారం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చర్చలు కూడా జరిపారు. తాము ఏ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ప్రధాన పార్టీల అభ్యర్థులకు చిన్నాచితకా పార్టీలు ఎసరు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంటే సిపిఎం, సిపిఎం, మజ్లీస్ పార్టీల మద్దతు ఆ పార్టీలకు కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత బలాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ స్థానిక సంస్థల కోటా కింద జరిగే ఎమ్మెల్సీల ఎన్నికలలో టిఆర్ఎస్కు మెజార్టీ సీట్లు దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ రెండు సీట్లు దక్కించుకోవచ్చు. కానీ కాంగ్రెస్ నుంచి పలువరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ వైపు వెళ్లడంతో ఈ ఎన్నికలు కాస్త రసోత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు కీలకంగా మారే అవకాశం ఉంది. వాస్తవంగా తమకు దక్కే స్థానాలను మించి ఎక్కువ సీట్లకు టిఆర్ఎస్ పోటీ చేస్తే ఎన్నికల్లో మరింత వేడి రాజుకునే అవకాశం ఉంది.
వలసవచ్చిన స్థానిక సంస్థ ప్రజాప్రతినిధుల బలంతో తనకు వచ్చే ఎమ్మెల్సీ సీట్ల ఎక్కువ సీట్లను టిఆర్ఎస్ దక్కించుకుంటుందని అంటున్నారు. మజ్లీస్ టిఆర్ఎస్కు మద్దతు ఇవ్వవచ్చునని అంటున్నారు. సిపిఐ, సిపిఎంలకు పలుచోట్ల స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు తీవ్రమైనప్పుడు సిపిఐ, సిపిఎం ఎటు మొగ్గు చూపుతాయనేది చర్చనీయంగా మారింది.
ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్న సిపిఎం, సిపిఐ కాంగ్రెసుకు మద్దతు ఇస్తాయా అనేది వేచి చూడాల్సిన అంశమే. కానీ ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించుతామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.
తన పార్టీలోకి వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వలస వచ్చినా స్థానిక సంస్థల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో పోటీ చేసేందుకు అధికార టిఆర్ఎస్ సాహసం చేస్తుందా అన్నది కూడా తేలాల్సిన విషయం. బలం మేరకే పోటీకి దిగాలా, ఎక్కువ సీట్లకు పోటీ చేయాలా అనే విషయంపై టిఆర్ఎస్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెసు, టిఆర్ఎస్ పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.