కిడ్నాప్ కాదు, మంత్రి తలసాని కొడుకు బెదిరించారు: ఎంపీ కొత్తపల్లి గీత భర్త
హైదరాబాద్: హైదరాబాద్లో కలకలం రేపిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని పేర్కొన్న ఆయన బెదిరింపులు మాత్రమే ఎదురయ్యాయని చెప్పారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రామకోటేశ్వరరావు మాట్లాడుతూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపారు. మంత్రి తలసాని కొడుకు సాయి యాదవ్, మరో వ్యక్తి రామకృష్ణతో వ్యాపార లావాదేవీలపై చర్చించడానికి తాజ్ కృష్ణ హోటల్కు వెళ్లినట్లు తెలిపారు. తన భూమిని ఆర్ ఆర్ కన్ స్ట్రక్షన్కు డెవలప్ మెంట్కు ఇచ్చానని చెప్పారు.
అయితే.. ఓ భూ వ్యవహారంలో మంత్రి తలసాని కుమారుడు తనను బెదిరించి కొన్ని డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని తన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను మంత్రి కుమారుడు బలవంతంగా లాక్కున్నాడని ఆయన పేర్కొన్నారు.
సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తనను నిర్భందించారని ఆయన పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్లోని జర్నలిస్టు కాలనీ సమీపంలో తనను కారులో ఎక్కించుకున్న రామకృష్ణ ఆ తర్వాత అర్ధరాత్రి కొండాపూర్ ప్రాంతంలో వదిలేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జరిగిన విషయాన్ని పంజాగుట్ట పోలీసులకు చెప్పడంతో పాటు తనను బెదిరింపులకు గురి చేసిన తలసాని కొడుకు సాయిపైనా ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. అర్థరాత్రి రామకోటేశ్వరరావు ఇంటికి చేరుకున్న ఆయన్ని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు విచారించారు.

కాగా కిడ్నాప్ వ్యవహారంపై వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు కిడ్నాప్ అయినట్లు సమాచారం అందగానే విచారణ చేపట్టామని వెల్లడించారు.
మంత్రి తలసాని శ్రీనివాసరావు కుమారుడు తనను బెదిరించాడని రామకోటేశ్వరరావు చెప్పాడని, అయితే.. దీనిపై లిఖిత పూర్వక ఫిర్యాదు అందగానే బెదిరింపుల వ్యవహారంపై విచారణ చేపడుతామని డీసీపీ తెలిపారు.












Click it and Unblock the Notifications