బిజెపి-టిడిపి స్నేహం వల్లే, ఇక్కడేనా ఏపీలో లేవా: కవిత, 'కాళకేయ'గా నిరసన
హైదరాబాద్: బిజెపి-తెలుగుదేశం పార్టీలు మిత్రపక్షం కావడం వల్లనే విభజన సమస్యలు సగం అలాగే ఉండటానికి కారణం అయిందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం నాడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె వామపక్ష పార్టీల పైన కూడా మండిపడ్డారు.
కార్మికులకు ఒక్క తెలంగాణలోనే సమస్యలు ఎదురు అవుతున్నాయా అని ప్రశ్నించారు. ఏపీలో కార్మికుల హక్కులకు భంగం కలగడం లేదా చెప్పాలన్నారు. ఏపీలో అంగన్ వాడీ సమస్యలు కమ్యూనిస్టులకు కనిపించడం లేదా అని నిలదీశారు.
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో హైకోర్టు విభజనే తమ తొలి ప్రాధాన్యమని ఆమె చెప్పారు. ఏపీలో కార్మికుల సమస్యలు ఎర్ర జెండా నేతలకు కనిపించవా అని నిలదీశారు. తెలంగాణ తెచ్చిన కెసిఆర్ దానిని అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఉద్యోగుల విభజనపై ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
కొన్ని విషయాల్లో ప్రధాని మోడీ అనుసరిస్తున్న తీరు సరిగా లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చశారు. టిడిపి మద్దతు గురించి బిజెపి ఆలోచిస్తే తెలంగాణ ప్రజల మద్దతు కోల్పోవాలసి వస్తుందని కవిత హెచ్చరించారు.
బాహుబళి కాళకేయతో నిరసన!
కేంద్రంలో అవినీతి మంత్రులను వెంటనే తొలగించాలని హైదరాబాదులో వామపక్షాలు సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్కు వరకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాహుబలి సినిమాలోని కాళకేయ వేషధారణలో వారు నిరసన తెలిపారు.