నయీం ఆగడాలు: సోదరిని తిట్టాడని చంపేశాడు, కానుకలుగా బైక్లు, బంగారు చైన్లు
హైదరాబాద్: ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో గ్యాంగస్టర్ నయీం ఆగడాలు ఒక్కటొక్కటే వరుసగా వెలుగు చూస్తున్నాయి. అతని చర్యలకు సమాజం నివ్వెరపోయే పరిస్థితి ఉంది. తన సోదరిని తిట్టాడనే కోపంతో నయీం ఓ రౌడీషీటర్ను చంపించాడు.
నల్లగొండలో నివసించే నయీం సోదరి సెటిల్మెంట్లు చేసేది. దీంతో ఆమెకు, యూసుఫ్ అనే రౌడీషీటర్కు మధ్య ఆధిపత్య పోరు చోటు చేసుకుంది. ఓ సందర్భంలో యూసుఫ్ ఆమెను తిట్టాడు. దాంతో నయీంకు మండిపోయాడు. అతని హత్యకు పథక రచన చేసి అమలు చేశాడు.
నయీం సూచన మేరకు టమాట శ్రీను రంగంలోకి దిగాడు. నిరుడు ఫిబ్రవరిలో అతని గ్యాంగ్ యూసు్ఫను చంపేసింది. శ్రీను గ్యాంగ్ జైలు నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత ద్విచక్ర వాహనాలు లేవని, ఇబ్బందిగా ఉందని నయీంకు చెప్పడంతో గ్యాంగ్స్టర్ అందరికీ ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేశాడు.
కానుకలుగా బంగారు చైన్లు, బైక్లు
హతమైన తన తమ్ముడు అలీమొద్దీన్ కూతురు అహేలా బేగం నిశ్చితార్థాన్ని నిరుడులజూలై 24న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నయీం ఘనంగా నిర్వహించాడు.
ఎప్పట్లాగే, ఆహ్వానితులకు ఆహ్వాన పత్రం ఇచ్చాడు. అయితే అందులో వేదిక ఎక్కడో చెప్పలేదు. ఫంక్షన్కు ఒకరోజు ముందు ఏసీ బస్సులు పెట్టి వారిని తరలించాడు. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు భారీ బందోబస్తు మధ్య నయీం ఫంక్షన్ హాల్లో ప్రత్యక్షమయ్యాడు. అతిథులకు ఒక్కొక్కరికి తులం బరువున్న బంగారు చైన్లు బహూకరించాడు.
ఆ రోజు వందకుపైగానే చైన్లు అందజేసినట్లు పోలీసు కస్టడీలో ఉన్న తబ్రేజ్ తల్లి అస్మత్ తాజ్ వెల్లడించినట్లు సమాచారం. మరికొందరికి ద్విచక్ర వాహనాలు ఇచ్చాడు. సమీప బంధువు, నల్లగొండకు చెందిన వరుడు తబ్రేజ్ను ఖుషీ చేసేందుకు స్విఫ్ట్ డిజైర్ కారు, బంగారు గొలుసు, రెండు ఉంగరాలు, నల్లగొండ శివారు పర్వతగిరిలో తాను ఆక్రమించిన గెస్ట్ హౌస్ను కానుకగా నయీం ఇచ్చాడు. నల్లగొండ సమీపంలోని పగిడిపల్లిలో ఉన్న భూమిని తబ్రేజ్కు పెళ్లి కానుకగా ఇచ్చినట్లు విచారణలో తేలింది.