అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త మున్సిపల్ చట్టం : ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ : అవినీతిని ఏ స్థాయిలో ఉపేక్షించబోమని తెలంగాణ సర్కార్ ఇదివరకే స్పష్టంచేసింది. అన్ని ప్రభుత్వ విభాగాలు, సంస్థలను మరింత పారదర్శకంగా రూపొందిస్తామని తెలిపింది. దీనిపై పలు వేదికల మీద సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పురపాలన చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు.
అవినీతి నిర్మూలనే లక్ష్యం
అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త పురపాలక చట్టం తీసుకొస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త పురపాలన చట్టం రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో పురపాలన చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్షించారు.
పంచాయతీరాజ్ మాదిరిగా ...
రాష్ట్రంలో ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. అందుకనుగుణంగా కొత్త పంచాయతీలను ఏర్పాటుచేయడంతోపాటు పంచాయతీలకు అధికారాలు, బాధ్యతలు కూడా అప్పగించారు. అదేవిధంగా పురపాలక సంస్థలను మరింత బలోపేతం చేసి .. వాటికి అధికారాలు, బాధ్యతలు అప్పగించేలా కొత్త చట్టం చేస్తామని ఇదివరకే కేసీఆర్ ప్రకటించారు.
ఏయే అంశాలను ఫోకస్ చేయాలి ?
నూతన పురపాలన చట్టంలో ఏయే అంశాలపై దృష్టిసారించాలి ? ఏయే బాధ్యతలు పురపాలక సంస్థలకు అప్పగించాలనే అంశంపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో త్వరలో పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని ముందు తీసుకురావాలా ? ఎన్నికల తర్వాత తీసుకురావాలా అనే అంశపై ప్రధానంగా డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది.