రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు: ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరం ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 29 డిగ్రీల వరకు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

పశ్చిమ దిశ నుంచి గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే, గురువారం నుంచి శుక్రవారం వరకు పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఇటీవల కురిసిన వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీటి మునిగిన విషయం తెలిసిందే. వర్షాలతో 41 మంది మరణించగా.. వందలాది పశువులు ప్రాణాలు కోల్పోయాయి. భారీ మొత్తంలో పంట నష్టం జరిగింది. పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమవడంతో తమను ఆదుకోవాలని బాధిత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కాగా, బుధవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులను కలిసి వారితో మాట్లాడారు. వరద ప్రాంతాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓరుగల్లు వరద బాధితులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు.
మొదట పలు ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించిన గవర్నర్.. అనంతరం ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్కు అర్చకులు పూర్ణకుంభంలో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తమిళిసై.. మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందుగా హనుమకొండలోని జవహర్నగర్, నయీమ్నగర్ ముంపుప్రాంత ప్రజలను పరామర్శించి వారికి హెల్త్ అండ్ హైజీన్ కిట్లను అందజేశారు.












Click it and Unblock the Notifications