23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్: కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్.. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశమయ్యారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.
Recommended Video

ధరణితో నవశకం..
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతోందని తెలిపారు. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నూతన శకం ఆరంభమైనట్లుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలు ధరణి ద్వారా వ్యవసాయ భూములకు భరోసా దొరికిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ధరణి పోర్టల్ ఇప్పటికే చిన్న చిన్న సమస్యలను అధిగమించిందని, మరో మూడు నాలుగు రోజుల్లో అన్ని రకాల సమస్యలను వంద శాతం అధిగమిస్తుందని కేసీఆర్ చెప్పారు.

నవంబర్ 23 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్..
సమస్యలన్నీ పూర్తిగా చక్కబడ్డాకే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలనే ఇంత కాలం వేచిచూసినట్లు తెలిపారు. నవంబర్ 23 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. ధరణి పోర్టల్ అద్భుతంగా తీర్చిదిద్దారని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. కాగా, ధరణి పోర్టల్ను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పోర్టల్లో కొన్ని సాంకేతిక లోపాలున్నాయని గతంలోనే పేర్కొన్నారు.

జూనియర్ లెక్చరర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
మరోవైపు, జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలపైనా సీఎం కేసీఆర్ చర్చించారు. జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా ప్రభాకర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అర్హత కలిగివుండి, భర్తీకి అవకాశం ఉన్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయడానికి వెళ్లదలచుకున్న.. జూనియర్ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్లకు అవకాశం కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారు ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని, వారిని రెగ్యూలరైజ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నం కోర్టులో కేసుల వల్ల నిలిచిపోయిందన్నారు. అయితే, తాము వారి జీతాలను రెట్టింపు చేశామని తెలిపారు.












Click it and Unblock the Notifications