వైఎస్ షర్మిల-జగన్లకు కేసీఆర్ డబుల్ చెక్: అన్నాచెల్లెలిద్దరికీ సింగిల్ షాట్..షాక్
హైదరాబాద్: ఏపీ-తెలంగాణ మధ్య మరోసారి తలెత్తిన జల వివాదాలను అధికార టీఆర్ఎస్.. రాజకీయంగానూ మలచుకునే ప్రయత్నం చేస్తోన్నట్లు కనిపిస్తోంది. భారీ నీటి ప్రాజెక్టులతో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి పావులు ఇప్పటికే కదిపిన ఆ పార్టీ నాయకులు.. క్రమంగా దీన్ని వైఎస్ షర్మిల మెడకూ చుట్టే అవకాశాలు లేకపోలేదు. జల వివాదాలను తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు- వైఎస్సార్సీపీ, వైఎస్సార్టీపీలకూ ఏకకాలంలో డబుల్ చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

రాయలసీమ లిఫ్ట్తో
ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానదిపై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ అంశాన్ని కేసీఆర్.. తనకు అనుకూలంగా మార్చుకోనున్నారనేది స్పష్టమౌతోంది. కృష్ణానదికి సంభవించే వరదల సమయంలో అదనపు జలాలను పోతిరెడ్డిపాడు నుంచే రాయలసీమ జిల్లాలకు తరలించడానికి ఏపీలోని జగన్ సర్కార్ నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం మరోసారి రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. అదనపు జలాలను తరలించడానికే అయినప్పటికీ- కేసీఆర్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని జగన్ సర్కార్ కూడా తప్పుపడుతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ మంత్రిత్వ శాఖల వద్ద తన వాదనలను ఇదివరకే వినిపించింది.

వైఎస్ షర్మిలకు ఇబ్బందులే..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మొదట్లో పెద్దగా పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు దాన్ని ప్రస్తావనకు తీసుకుని వస్తోండటానికి వైఎస్ షర్మిల ఓ కారణంగా భావిస్తోన్నారు. జులై 8వ తేదీన తన తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించడానికి సమాయాత్తమౌతోన్న వైఎస్ షర్మిలకు చెక్ పెట్టడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యూహాత్మకంగా కేసీఆర్ తెరమీదికి తీసుకొచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో షర్మిల తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుందనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.

షర్మిల సమాధానం చెప్పాల్సిందే..
ఒకవంక- వైఎస్ జగన్ మరోవంక ఆయన సోదరికి రాజకీయంగా ఇబ్బందులను సృష్టించడానికి జల వివాదాలను కేసీఆర్ సర్కార్ కేంద్రబిందువుగా చేసుకున్నట్టే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో వైఎస్ షర్మిల తన వైఖరిని స్పష్టం చేయాల్సిన పరిస్థితిని కల్పించారు కేసీఆర్. దీనిపై ఆమె సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి దాదాపు ఎదురైనట్టే. దీన్ని వ్యతిరేకిస్తే- తన సొంత ప్రాంతంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకూలంగా మాట్లాడితే- తెలంగాణలో ప్రతికూల పరిస్థితులు సంభవిస్తాయి. దీనితో ఆచితూచి స్పందించాలని షర్మిల భావిస్తోన్నట్లు చెబుతున్నారు.

వైఎస్ జగన్కూ..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఆలస్యంగానైనా కేసీఆర్.. తన వైఖరిని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన వైఎస్ జగన్ను మూర్ఖుడిగా అభివర్ణించినట్లు వార్తలొచ్చాయి. ఘాటుగా స్పందించడం ద్వారా ఏపీతో తెలంగాణ ప్రభుత్వం ఘర్షణ వైఖరికి తెర తీసినట్టయిందని అంటున్నారు. దీనితో- జల వివాదాలపై మొదటి నుంచీ తెలంగాణ పట్ల మెతక వైఖరినే ప్రదర్శిస్తూ వస్తోన్న జగన్ సర్కార్.. ఇక అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడక తప్పని పరిస్థితి ఏర్పడినట్టే. చట్టపరంగా పోరాడుతూనే.. తన వాదనను తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుందిక.












Click it and Unblock the Notifications