తెలంగాణలో పోటీ అందుకే: జనసేన అభ్యర్థులకు బీ ఫాంలు అందించిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం బీఫాంలు అందించారు. బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారందరికీ నామినేషన్ పత్రాలను అందించారు పవన్ కళ్యాణ్.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలన్నారు. హోం రూల్ ఉండాలనే ఉద్దేశంతో దశాబ్దకాలం పోటీకి దూరంగా ఉన్నామన్నారు. తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉంటామన్నారు పవన్.

2008లోనే తాను తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఇక్కడి ప్రజల బాధలను అర్థం చేసుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి జనసేన పార్టీని ముందుకు నడిపించేలా చేస్తోందన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన దశాబ్దకాలం తర్వాత జనసేన ఇక్కడ పోటీ చేస్తోందన్నారు.
1200 మందికి పైగా యువత, విద్యార్థుల ఆత్మగౌరవార్థం హోంరూల్ పాటించాలనే ఆలోచనతో దశాబ్దం పాటు పోటీకి దూరంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ఆశయ సాధన కోసం జనసేన కట్టుబడి ఉందన్నారు. ఏపీపై దృష్టి సారిస్తూనే తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన దిగుతున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.

జనసేన నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే:
కూకట్పల్లి: ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు: నేమూరి శంకర్ గౌడ్
కోదాడ: మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూల్: వంగల లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం: మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం: లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ): డా. తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావుపేట(ఎస్టీ): ముయబోయిన ఉమాదేవి.












Click it and Unblock the Notifications