బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలి: కేసీఆర్ ఫాంహౌస్కు నీళ్ల కోసం లక్షా 20వేల కోట్ల ఖర్చంటూ బండి సంజయ్
మహబూబ్నగర్: రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. నారాయణపేట జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్.. అక్కడి వాల్మీకి బోయల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. వాల్మీకి బోయల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.

మజ్లిస్, కేసీఆర్ కుమ్మక్కు వల్లే అన్యాయం: బండి సంజయ్
బోయ వాల్మీకులారా కేసీఆర్ చరిత్ర రాయండి.. బీజేపీ గెలిస్తే వాల్మీకిల సమస్యను పరిష్కరిస్తామని బండి సంజయ్ అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని అన్నారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో ఎందుకు చర్చడం లేదని కేసీఆర్ సర్కారును ఆయన ప్రశ్నించారు. మజ్లిస్ కేసీఆర్ కుమ్మక్కు వల్లే హిందువులకు అన్యాయం జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు.

కేసీఆర్ ఫ్యామిలీ జీతం నెలకు రూ. 25 లక్షలు: బండి సంజయ్
బాంచన్ బతుకులు కావాలా? పేదల రాజ్యం కావాలా? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వరు కానీ.. కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కేసీఆర్ కుటుంబం నెకు రూ. 25 లక్షల జీతం తీసుకుంటోందన్నారు. టీఆర్ఎస్ నేతలకు మంత్రి పదవులు బీజేపీ వేసిన భిక్షేనని అన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలని కసితో పాదయాత్ర చేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు.

కేసీఆర్ ఫాంహౌజ్ కు నీళ్ల కోసం రూ. 1.20 లక్షల కోట్లు ఖర్చు చేశారన్న బండి
సర్వ మండలంలో మూడు రిజర్వాయర్లున్నా.. నీళ్లు రావు. .కేసీఆర్ ఫాంహౌజ్కు నీళ్ల కోసం రూ. 1.20 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. రూ. వేల కోట్లు ఖర్చు చేసి గోదావరి నుంచి ఫాంహౌజ్కు నీళ్లు తెచ్చుకున్నారు. రూ. 3.4 కోట్లిస్తే ఈ ప్రాంతానికి తీసుకురావచ్చని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి షెకావత్ తో మాట్లాడి ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఆరు నెలల్లో నీళ్లు తీసుకురావచ్చన్నారు.

బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ బండి సంజయ్
ఏడేండ్లుగా సీఎం కేసీఆర్ రైతుల్ని మోసం చేస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. వరి ధాన్యం కొనమంటే కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు. దళిత బంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎంత మంతమందికి దళిత బంధు ఇచ్చారో చెప్పాలన్నారు. దళితులకు మూడేకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర నిధులను కేసీఆర్ దారి మళ్లించారని బండి సంజయ్ ఆరోపించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. గడీల రాజ్యం పోవాలని.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications