మీడియా నా మాటలను వక్రీకరించింది: పోచారం
నిజామాబాద్: రైతుల ఆత్మహత్యల విషయంలో తాను చేసిన వ్యాఖ్యను కొన్ని పత్రికలు వక్రీకరించాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యలు వాస్తవమేనని తాను చెప్పానని, అయితే ఆ మాటలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని ఆయన శనివారం నిజామాబాద్లో అన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు. రైతు ఆత్మహత్యలపై తాను చేసిన వ్యాఖ్యలపై కొన్ని పత్రికల తీరును ఆయన ఖండించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపల ఆ కుటుంబాలను ఆదుకుంటామని ఆయన చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, తాను కూడా రైతు బిడ్డలమేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు తన సొంత రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. కానీ కెసిఆర్ మాత్రం తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారని ఆయన చెప్పారు.
తాను ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలపై తాను ఏ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయలేదని ఆయన అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేశాయని ఆయన అన్నారు.