దమ్ముందా: పొన్నం, టీలో టీడీపీ సబ్కేబినెట్: షబ్బీర్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన సోమవారం మరోసారి నిప్పులు చెరిగారు. ఆయన పైన తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. జగదీశ్వర్ రెడ్డికి దమ్ముంటే తన పైన చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు.
అవినీతి ఆరోపణలు వచ్చాయని రాజయ్యను మంత్రి పదవి నుండి తొలగించారని, అదే జగదీశ్వర్ రెడ్డి విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రశ్నించారు. మంత్రి పైన ఆరోపణలను రుజువు చేసే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు.
జగదీష్ రెడ్డి అవినీతి పైన టోల్ ఫ్రీ నెంబరుతో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. జగదీశ్వర్ రెడ్డి అవినీతి పైన విచారణ జరిపించాలన్నారు. అధికారం లేని ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ మారారని ఎద్దేవా చేశారు. తన పైన జగదీశ్వర్ రెడ్డి కోర్టుకు వెళ్తే తాము ప్రజాకోర్టుకు వెళ్తామన్నారు.
తెలంగాణ కేబినెట్లో టీడీపీ సబ్ కేబినెట్: షబ్బీర్
తెలంగాణ కేబినెట్లో టీడీపీ సబ్ కేబినెట్ నడుస్తోందని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. మంత్రి కడియం శ్రీహరి నరనరాన తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. మంత్రివర్గంలో ఎక్కువ మంది టీడీపీ నుండి వచ్చిన వారే అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 30 శాతమే ఖర్చు చేసిందని, 21 రోజుల్లో మిగతా ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ అల్లుడు, కొడుకు శాఖలకే 50 శాతం నిధులు కేటాయిస్తున్నారన్నారు.
హెచ్చార్సీని ఆశ్రయించిన శోభారాణి
మెదక్ జిల్లాలో పాలు ఇవ్వకపోవడంతో పసిపాప చనిపోయిన ఘటనపై తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి హెచ్చార్సీని ఆశ్రయించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఘటనపై ప్రభుత్వం ఇంతవరకు దృష్టి సారించలేదన్నారు. పాలులేక పసిబిడ్డ చనిపోతే కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దారుణమని ప్రభుత్వం తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.