హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు: ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్: నగరంలో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వెబ్సైట్లలో ఫోన్ నెంబర్లు, వ్యభిచారిణుల ఫొటోలు పోస్టు చేసి హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ రమేష్, మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్ సునీత సోమవారం మీడియా సమావేశంలో ఈమేరకు వివరాలు తెలిపారు.
పాతబస్తీ బార్కాస్కు చెందిన వ్యాపారి మహ్మద్ ఇర్ఫాన్ గతంలో వ్యభిచార గృహం నిర్వహించే ఓ వ్యక్తి వద్ద కారు డ్రైవర్గా పని చేశాడు. ముంబైకి చెందిన అలోక్, సలీం అనే వ్యభిచార ఏజెంట్లతోనూ అతనికి పరిచయం ఉంది. వారితో కమీషన్పై వ్యవస్థీకృత వ్యభిచారాన్ని నిర్వహించాలని నిర్ణయించాడు. మరోవైపు ఇర్ఫాన్ తన స్నేహితులు దిల్సుఖ్నగర్కు చెందిన మొయిన్, సదాశివ్ పేటకు చెందిన షేక్ నసీర్ అలియాస్ బాబాతో కలిసి కొనసాగించాలని పథకం వేసుకున్నారు.
గచ్చిబౌలి ఇంద్రానగర్లో ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. అలోక్ తోపాటు ఢిల్లీకి చెందిన మరో ఏజెంట్ కపిల్ రీనా అనే మహిళను ఇర్ఫాన్తో పరిచయం చేయించి ఇక్కడికి పంపించారు. షేక్ నసీర్, రీనా మణికొండ శ్రీనివాస్నగర్లో మరో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం అలోక్ ముంబై నుంచి వ్యభిచారిణులను విమానంలో నగరానికి పంపిస్తుంటాడు. విమానాశ్రయం నుంచి వారిని రెండు మూడు వాహనాలు మార్చి మరీ ఇర్ఫాన్, రీనాలు తాము అద్దెకున్న గృహాలకు తీసుకొస్తారు.
వెబ్సైట్లలో మొయిన్ తన ఫోన్ నెంబరుతోపాటు సెక్స్ వర్కర్ల ఫొటోలను పలు వెబ్సైట్లలో పోస్టు చేస్తాడు. సంప్రదించేవారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకుని ఆ వివరాలను ఫేస్బుక్, ఇతర వెబ్సైట్లలో పొందుపరుస్తాడు. ఆ తర్వాత వారిని తమ గృహాలకు రప్పిస్తారు. ఇలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 10వేల నుంచి 20వేల వరకు వసూలు చేస్తారు.
ఆ డబ్బులను 80శాతం తమ వద్ద ఉంచుకుని మిగితాది ముంబైలోని ఏజెంట్కు పంపిస్తారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులు ఇర్ఫాన్, మొయిన్, పి. దుర్గ, బినూఫ్, రీనా, షేక్ నీసర్, షేర్ని క్రిస్సిలను అరెస్టు చేశారు. కాగా, వారిలో క్రిస్సి, బినూఫ్లు బెయిల్పై విడుదలయ్యారు.