డబ్బులెక్కువ పెట్టి తత్కాల్ టికెట్లు తీసుకుంటున్నారని రైల్వేకు బాగా లోకువ!
ప్రజా రవాణా సాధనంగా ఉండాల్సిన భారతీయ రైల్వేను పాలకులు క్రమక్రమంగా వాణిజ్య కంపెనీగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సంవత్సరాల కిందట తత్కాల్ టికెట్లను ప్రవేశపెట్టారు. ప్రయాణానికి 24 గంటల ముందు వీటిని జారీచేస్తారు. ధర కూడా చాలా ఎక్కువ. అయినా ప్రయాణికులు వీటికోసం ప్రయత్నిస్తుంటారు. తత్కాల్ టికెట్ కన్ ఫర్మ్ అయిన తర్వాత అవి రద్దు కావు. ప్రయాణం చేయడం మానుకున్నా ఆ డబ్బులు వెనక్కి ఇవ్వరు. అంతేకాదు.. తత్కాల్ లో టికెట్లు బుక్ చేసుకునేవారంటే రైల్వేకు ఎంత లోకువంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం.
రైల్వేకు ఉండే అలసత్వాన్ని మార్చలేం
స్లీపర్ అయినా, థర్డ్ ఏసీ అయినా మిడిల్ బెర్త్ లకు ఎవరూ ప్రాధాన్యతనివ్వరు. కానీ డబ్బులెక్కువ పెట్టి తత్కాల్ టికెట్లు తీసుకునేవారి కోసం రైల్వే వీటిని రిజర్వు చేసి పెడుతుంది. ఏదో ఒకటి టికెట్ దొరికిందిగా సర్దుకొని వెళతారులే అనేది రైల్వే భావన కావొచ్చు. అలాగే సిట్టింగ్ ఉండే ఇంటర్ సిటీ రైళ్లల్లో కూడా మూడు సిట్టింగ్స్ ఉంటే మధ్యలోది ఎవరూ కోరుకోరు. ఇవి కూడా తత్కాల్ వారికే కేటాయిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే తత్కాల్ టికెట్లు తీసుకునే ప్రయాణికుల పట్ల రైల్వేకు ఉండే అలసత్వాన్ని మార్చలేం. సాధారణంగా ఎవరికో చాలా అరుదుగా లోయర్ బెర్త్ దొరుకుతుంది.

మిడిల్ బెర్త్ ను ముఖాన పడేస్తారు
ముందుగా చేసుకునే రిజర్వేషన్లలో ప్రయాణికులు సైడ్ లోయర్, సైడ్ అప్పర్, లోయర్, అప్పర్ కోరుకుంటారు. మిగిలిపోయి మిడిల్ ను తత్కాల్ ప్రయాణికుల ముఖాన పడేస్తారు. ఇప్పటికే వందే భారత్ రైళ్ల పేరుతో భారీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాటికి, సూపర్ ఫాస్ట్ రైళ్లకు పెద్దగా తేడా ఏమీ ఉండదు. మహా అయితే అరగంట నుంచి గంట.
ఆ గంట సమయం కోసం వందలకొద్దీ రూపాయలు తగలేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. పబ్లిసిటీ చేసి వందేభారత్ ద్వారా సొమ్ము చేసుకోవడమే. ఇక వందేభారత్ స్లీపర్ వస్తే దాని ధరలకన్నా విమానంలో వెళ్లడమే నయమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వందే భారత్ స్లీపర్ పట్టాలెక్కిన తర్వాత ధరలు చూసి కళ్లు తిరిగిపోవడమే తఱువాయి.












Click it and Unblock the Notifications