నాకు బెయిల్ వస్తే కెసిఆర్కు జ్వరం వచ్చింది: రేవంత్ రెడ్డి దూకుడు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో అరెస్టయి బెయిల్పై విడుదలైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఏ మాత్రం దూకుడు తగ్గించడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. చర్లపల్లి జైలు నుంచి బుధవారం సాయంత్రం విడుదలైన తర్వాత ఆయన టిడిపి కార్యకర్తలను, తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. కెసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా కేసు పెట్టిందని ఆయన ఆరోపించారు. కెసిఆర్పైనే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)పై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగాన్నంతా తనపైనే ప్రయోగించి ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని బయటపెట్టినందుకే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గొంతు కోశారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డే అయితే టీఆర్ఎస్లో చేర్చుకున్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. టిడిపిని నామరూపాలు లేకుండా చేస్తానని గతంలో అన్న వ్యక్తి పావురాల గుట్టలో పావురమై పోయాడని ఆయన వైయస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

ఇటీవల ఏలూరులో ఒక బాలికను అత్యాచారం చేసిన వ్యక్తిని అక్కడివారు తొక్కి చంపినట్లే కేసీఆర్ కుటుంబాన్ని కూడా తెలంగాణ ప్రజలు రాజకీయ సమాధి చేస్తారని రేవంత్ హెచ్చరించారు. కేసీఆర్ను గద్దె దింపడమే తన ఏకైక లక్ష్యమని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబాన్ని రాజకీయాల నుంచి తరిమికొట్టేలా ప్రజలను చైతన్యపరుస్తానని, ప్రతి యువకుడిని భుజం తట్టి లేపుతానని అన్నారు.
తెలంగాణ మంత్రులంతా చాల మాట్లాడుతున్నారని, సోడాలు కలిపేవాళ్లు, మోండా మార్కెట్లో ఆలుగడ్డలు అమ్మే వ్యక్తి మంత్రులయ్యారని, సన్నాసులంతా తాగుబోతోడి పక్షం చేరారని వ్యాఖ్యానించారు.
చర్లపల్లి జైలు నుంచి విడుదలైన అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ "రెండు పెగ్గులేస్తే కానీ లేవలేని సన్నాసి ఉద్యమాన్ని నడిపాడని అంటున్నారు. అంతేకాదు, తెలంగాణ జాతిపిత అని కూడా అంటున్నారు. ఈ సన్నాసి ఉద్యమం చేస్తే ఆ సన్నాసులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు" అని ఆవేశంగా మాట్లాడారు.
రాజకీయాల్లోకి రాక ముందు మేనమామ ఇంట్లో రబ్బరు చెప్పులు వేసుకుని, చాయ్ కప్పులు ఎత్తేవానికి, మేనమామ గత చరిత్ర తెలియదని అన్నారు. ఇంటికెళ్లి మామ పదవులు రాకముందు ఏం చేసేవాడో తన తల్లిని అడగాలని ఆయన సూచించారు.
అప్పడామె... మీ మేనమామ గల్ఫ్ ఏజెంట్ అని, విదేశాలకు జనాలను తరలించేవాడని చెబుతారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్పై పాస్ పోర్టు కుంభకోణం కేసులు ఉన్నాయని అన్నారు.
అప్పట్లో పోలీసులెక్కడ పట్టుకెళ్లిపోతారోనని ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ ఇంట్లో దాక్కున్నాడని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు తాగుబాతును జాతిపిత అని సన్నాసులు అంటున్నారని, తాగుబోతు ఎక్కడైనా జాతిపిత అయితడా? అని రేవంత్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications