ఒక్కొక్కరుకాదు అందరూ ఒకేసారి రండి, గంటనక్క, పాతాళానికి తొక్కేస్తా: రేవంత్ తిట్లు, నా వెనుక వీరే
కొడంగల్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం దుమ్మెత్తిపోశారు. తెరాస అధినేతపై తిట్ల వర్షం కురిపించారు. కేసీఆర్కు తమ పదునేమిటో చూపిస్తామని, పట్టుదల ఏమిటో చూపిస్తామని చెప్పారు. కేసీఆర్ ఉద్యమకారుడు కాదని దగుల్బాజీ, దోపిడీదారు అన్నారు.
నేనే రాజ్యం.. రాజ్యమంటేనే నేను అనేలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారన్నారు. కొడంగల్ ప్రజలతో గోక్కునేవాడు ఎవడూ రాజకీయంగా బతికి బట్టకట్టలేదన్నారు. గుర్నాథ్ లాంటి వాళ్లే కాలగర్భంలో కలిశారన్నారు. చింతమడక చీటర్లకు కొడంగల్లో ప్రవేశం లేదన్నారు. రేవంత్ ఉన్నంత వరకు కొడంగల్కు హైటెన్షన్ వైరు కాపలా ఉన్నట్లే అన్నారు. కేసీఆర్ సింహం కాదని, గుంట నక్క అన్నారు.
రావణాసురుడు బయలుదేరాడు
పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించాలని రావణాసురుడు బయలుదేరాడని కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ మండిపడ్డారు. ఆయనను చార్లెస్ శోభరాజ్తో పోల్చారు. కేసీఆర్కు చీమునెత్తురు ఉందా అన్నారు. పట్నం సోదరులకు వ్యతిరేకంగా పని చేయవద్దని పోలీసులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
సవాల్.. ఒక్కొక్కరు కాదు అందరూ ఒకేసారి రండి
కేసీఆర్కు తాను సవాల్ విసురుతున్నానని, ఒక్కొక్కరు కాదని, అందరూ కలిసికట్టుగా ఒకేసారి రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో కొడంగల్ ప్రజలు పాండవుల పక్షానే నిలబడతారని చెప్పారు. కౌరవుల సేన అయిన కేసీఆర్ వర్గానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఉద్యమకారుడు కాదని, దగుల్బాజీ, దోపిడీదారు అన్నారు.
తనకు కొడంగల్ ప్రజల అండ
కేటీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ సింహం కాదని, గుంటనక్క అన్నారు. మీ అయ్య గుంటనక్క వేషాలు, మీ బావ (హరీష్ రావు) తోడేళ్ల వేషాలు వేస్తున్నారని నిప్పులు చెరిగారు. కొడంగల్ ప్రజల అండతో తాను కొండను అయినా ఢీకొంటానని చెప్పారు. కొడంగల్ ప్రజలు అండనే తనకు ఉన్న అతిపెద్ద దైర్యం అని చెప్పారు. తన వెనుక ఉన్నది వారేనని అభిప్రాయపడ్డారు. కొడంగల్ ప్రజలతో గోక్కున్నవాడు బతికిబట్టకట్టలేదని, గుర్నాథ్ రెడ్డి అంతటి వాడే రాజకీయంగా కాలగర్భంలో కలిశారన్నారు. చింతమడక చీటర్లకు కొడంగల్లో ప్రవేశం లేదన్నారు.
వందమంది కేసీఆర్లు వచ్చినా పాతాళానికి తొక్కేస్తా
ఒక్క కేసీఆర్ కాదని, వందమంది కేసీఆర్లు వచ్చినా తాను పాతాళానికి తొక్కేస్తానని రేవంత్ రెడ్డి దుమ్ముదులిపారు. సిద్దిపేట నుంచి ఒకడు, షాబాద్ నుంచి మరొకడు కొడంగల్ బయలుదేరాడని విమర్శించారు. 4వ తేదీన కొడంగల్ నియోజకవర్గ బంద్ను ఉపసంహరించుకుంటున్నామని, కేసీఆర్ పర్యటనలో నిరసన తెలుపుతామని చెప్పారు. కేసీఆర్కు తమ పదును, పట్టుదల ఏమిటో చూపిస్తామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.