కేసీఆర్! మాట తప్పుతారా?: రేవంత్ విమర్శలు, బీజేపీనీ వదల్లేదు
తెలంగాణ ప్రభుత్వంపై టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని రేవంత్రెడ్డి డిమాండు చేశారు.
మాట తప్పుతారా?
అనారోగ్యంతో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ను సోమవారం రేవంత్ పరామర్శించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ మాట తప్పడం సమంజసం కాదన్నారు.
ఇలాంటి ప్రభుత్వంపై ప్రశంసలా?
ఖమ్మం ఆస్పత్రిలో నిండు గర్భిణికి మంచం కూడా కేటాయించక బిడ్డ మరణించిందని, స్వైన్ఫ్లూతో ప్రాణాలు కోల్పోవడం వైద్యశాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. ఇలాంటి ప్రభుత్వంపై కేంద్రమంత్రులు ప్రశంసించడం సరికాదని అన్నారు.
ఏం చెబుతున్నారు?
స్థానిక బీజేపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తుంటే.. జాతీయ నేతలు మాత్రం కేసీఆర్ సర్కారు పనితీరును ప్రశంసించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
అధికారికంగా జరపాల్సిందే..
ఇది ఇలా ఉండగా, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ను ముట్టడించేందుకు ఆయన యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.