కొడంగల్ వస్తే: కేసీఆర్కు రేవంత్ రెడ్డి వార్నింగ్, అనుచరుల ఇళ్లలో రాత్రుళ్లు తనిఖీలు
హైదరాబాద్: తనను అడ్డుకోవడం తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి (ఆపద్ధర్మ) హరీష్ రావుల వల్ల కూడా కాదని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు. ఈ నెల 4వ తేదీన కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గంలో పర్యటంచనున్నారు. దీనిని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు.
ప్రజలు ఆశీర్వదిస్తే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గాన్ని హైటెన్షన్ తీగలా రక్షించుకుంటానని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని గత ఎన్నికల్లో చెప్పిన కేటీఆర్ ఎవరికైనా ఇచ్చారా అని నిలదీశారు.
గంగిరెద్దులవాళ్లకు తెరాస వాళ్లకు తేడాలేదు
సంక్రాంతి రోజు గంగిరెద్దుల వాళ్లకు, టీఆర్ఎస్ వాళ్లకు తేడా లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ చేసి పాస్పుస్తకాలను ఇంటికి తెచ్చి ఇస్తామని చెప్పారు. పేదలకు ఆరు కిలోల చొప్పన సన్నబియ్యం అందజేస్తామని, కుటుంబానికి ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయలు ఉచితంగా అందజేస్తామన్నారు.
కేసీఆర్ హెలికాప్టర్ చెక్ చేస్తారా?
శనివారం రాత్రి కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చెలరేగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో సోదాలు చేయగా, పోలీసుల తీరును నిరసిస్తూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కొడంగల్ పర్యటనకు వస్తున్నారని, అప్పుడు ఆయన హెలికాప్టర్ చెక్ చేస్తారా అని నిలదీశారు.
కాంగ్రెస్ నేత నివాసంలో సోదాలు
సోదాలను నిరసిస్తూ తొలుత కాంగ్రెస్ నేతలు ఆందోళన తెలిపారు. దానికి రేవంత్ రెడ్డి మద్దతిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేత యూసుఫ్ నివాసంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. నగదు ఏమీ లభించలేదు. దీంతో వెనుదిరిగారు. రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరులు కావడంతోనే యూసుఫ్, ఆయన అన్న ముస్తాక్ల ఇళ్లపై ఇలా దాడులు జరుపుతున్నారని ఆరోపించారు.
రేవంత్ అనుచరుల ఇళ్లలో సోదాలు, కావాలనే ఇబ్బందులు
సెర్చ్ వారెంట్ చూపకుండానే వచ్చి తనిఖీలు చేశారని, మహిళలతో దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ కేడర్ ఆరోపించింది. సోదాలు జరిపినా ఏమీ లభించలేదని అధికారులు రాసివ్వాలని అడిగారు. పోలీసు అధికారులు వచ్చి వారిని అదుపుచేసే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో రేవంత్ ప్రచారం ముగించుకొని అక్కడకు వచ్చారు. తమ కార్యకర్తలను భయాందోళనకు గురిచేసేలా బెదిరిస్తున్నారని ఆయన వారికి మద్దతుగా బైఠాయించారు. రేవంత్ మరో అనుచరుడు రామచందర్ రెడ్డి ఇంట్లోను సోదాలు చేశారు. అక్కడా ఏమీ దొరకలేదు. కావాలనే రాత్రి సమయంలో వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.