కుమార్తె పెళ్లి: హడావుడిలోను కెసిఆర్ను వదలని రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి వివాహం ఆదివారం నాడు ఘనంగా జరిగింది. పెళ్లి హడావుడిలోను రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును వదల్లేదు.
బిసి క్రిమిలేయర్ పైన ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీలో బీసీలకు క్రిమిలేయర్ నిబంధన అమలు వల్ల బిసిలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. బీసీల్లో కొన్ని వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందినంత మాత్రాన అందరూ అభివృద్ధి చెందినట్లు కాదన్నారు.
బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారనే అక్కసుతోనే క్రిమిలేయర్ ప్రవేశ పెట్టారని, తక్షణం ఈ ఉత్తర్వులను ఉఫసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీసీల్లోని అన్ని కులాలు అభివృద్ధి చెందనందున ఈ నిబంధన అమలు చేయవద్దన్నారు.

కాగా, క్రిమిలేయర్ గుర్తింపునకు జీతాలు/వేతనాల ద్వారా, వ్యవసాయ భూమి ద్వారా వచ్చే ఆదాయాలను లెక్కలోకి తీసుకోబోమని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇవిగాక ఇతర ఆదాయాలు ఏడాదికి రూ.6 లక్షలు దాటితేనే క్రిమిలేయర్ కిందకు తెస్తామని తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు మాత్రమే క్రిమిలేయర్ నిబంధన అమలులో ఉంటుందని, విద్య, సంక్షేమ పథకాలు, ఎన్నికల రిజర్వేషన్లకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. వేతనాలు, వ్యవసాయాదాయాలను సంపన్నశ్రేణి నుంచి మినహాయించడం ఉద్యోగులు, రైతు కుటుంబాలకు ఊరట కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications