హైదరాబాద్కు మరో అంతర్జాతీయ సంస్థ: డ్రిల్ మెక్స్పాతో తెలంగాణ సర్కార్ రూ. 1500 కోట్ల డీల్
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ రాబోతోంది. ఆయిల్ డ్రిల్లింగ్, రిగ్ సెక్టార్లో ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీగా వెలుగొందుతున్న.. డ్రిల్మెక్ స్పా.. తెలంగాణలో రూ.15వందల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. హైదరాబాద్లో రిగ్గుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సోమవారం తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.
ప్రపంచస్థాయి సంస్థలు తరలిరావడం సంతోషంగా ఉందని తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. త్వరలోనే హైదరాబాద్లోనే మరో తయారీ యూనిట్ ప్రారంభం కాబోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచస్థాయి సంస్థలు తరలిరావడం, సీఎం కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో డ్రిల్మెక్ స్పా సంస్థతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఐటీ మంత్రి కేటీఆర్ ఉందన్నారు. 15 వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకొచ్చిందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని కేటీఆర్ వెల్లడించారు. దీంట్లో 80 శాతం వరకు స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చూస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
దేశంలో నాలుగో అతిపెద్ద ఎకానమీ కంట్రిబ్యూటర్గా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు కేటీఆర్. కానీ తమకు కేంద్రం నుంచి సహకారం కరవైందని చెప్పారు. ఏడున్నరేళ్లుగా రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని ఆరోపించారు బడ్జెట్ ప్రవేశపెడుతున్న దృష్ట్యా, హామీలు నిలబెట్టుకోవాలని ప్రధాని, ఆర్థికమంత్రికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని, తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ ఇండస్ట్రీయల్ రాయితీలు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో మరింత పురోగతిని సాధిస్తాయని పేర్కొన్నారు. వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
కాగా, డ్రిల్మెక్ స్పాకు ఆయిల్, నేచురల్ గ్యాస్ వెలికితీసే మెషినరీ తయారు చేయడంలో వందేళ్లకుపైగా అనుభవం ఉందన్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థే ఈ డ్రిల్మెక్. డ్రిల్ మెక్స్పా ఆయిల్ రిగ్గులను తయారు చేస్తోంది.