రైతు భరోసా అర్హతలు ఖరారు- దరఖాస్తు ఇలా, తుది నిర్ణయం..!!
తెలంగాణ ప్రభుత్వం రైతుభరసా పైన కీలక ప్రకటనకు సిద్దమైంది. రైతు భరోసా అమలు పైన మంత్రివర్గ ఉప సంఘం కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. సాగు చేసే ప్రతీ రైతుకు పరిమితి లేకుండా రైతుభరోసా అమలయ్యేలా నిర్ణయించారు. సాగు చేస్తుంటే ఐటీ చెల్లింపు దారులకూ వర్తించేలా సూచన చేసారు. సాగులో లేని భూములకు మాత్రం వర్తించదు. భరోసా కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిఫార్సుల పైన రేపు మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
వారందరికీ భరోసా
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పై కీలక నిర్ణయం తీసుకోనుంది. మంత్రివర్గ ఉప సంఘం ఈ అంశం పైన ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. అవకతవకలకు అవకాశం లేకుండా శాటి లైట్ మ్యాపింగ్ ద్వారా భూములను గుర్తించనున్నారు. భరోసా పొందేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరించనున్నారు. రైతులు పంటలు వేసినట్లుగా ధ్రువీకరించుకున్న తర్వాతే రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. పథకం అమల్లో ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేటు ఉద్యోగులైనా, ఆదాయపు పన్ను చెల్లింపుదారులైనా పంటలు సాగుచేస్తే పెట్టుబడి సాయాన్ని అందించాలని ఉప సంఘం సూచించింది.

సాగు చేయటమే అర్హత
ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు బీడు భూములు, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములకు రైతుభరోసా ఇవ్వకూడదని నిర్ణయించారు. ఈనెల 14వ తేదీ నుంచి యాసంగి రైతుభరోసా పథకానికి శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయ్యారు. అప్పటి నుంచి నెల రోజుల సమయం లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. తాజా ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగుభూమికి సాయం అందించాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. కాగా, గత ప్రభుత్వం ఎకరానికి రూ. 5 వేల చొప్పున గత ప్రభుత్వం చెల్లించగా... ఈ ప్రభుత్వం ఎకరానికి రూ. 7,500 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. పంటలు సాగుచేయని భూములకు గత ప్రభుత్వం రూ. 21,284 కోట్లు చెల్లించినట్లు గుర్తించారు.
కీలక సిఫార్సులు
పీఎం కిసాన్ లో లబ్ది పొందుతున్న వారి వివరాల ఆధారంగా మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వాని కి సిఫార్సులు చేసింది. ప్రజాప్రతినిధులు, ఐటీ చెల్లింపు దారులు, వైద్యులు వంటి కేటగిరీల్లో ఉన్న వారికి పథకం వర్తించకుండా నిర్ణయం చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, ఈ కేటగిరీల్లో ఉన్నవారికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు చేసింది. సాగు చేసే వారికి పథకం అమలు చేయాలని.. ఇందులో ఎలాంటి షరతులు ఉండ కూడదని అభిప్రాయపడింది. దీంతో, వ్యవసాయం చేస్తున్న ప్రతీ ఒక్కరూ ఈ పథకంలో లబ్ది దారులు కానున్నారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల పైన రేపు (శనివారం) జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది.












Click it and Unblock the Notifications