విసిగిపోయి పిల్లలతో సారిక ఆత్మహత్య: రాజయ్య ఫ్యామిలీ ఒత్తిడి చేసింది
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు, ఆమె ముగ్గురు పిల్లలది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. సారిక పిల్లలను తీసుకుని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. బుధవారం తెల్లవారు జామున మంటలు చెలరేగడంతో సారిక, ఆమె పిల్లలు సజీవ దహనమైన విషయం తెలిసిందే.
వారి మరణంపై పోలీసులు రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు ఇందుకోసం పోలీసులు 24 మందిని ప్రశ్నించారు. సారిక, ఆమె పిల్లల కేసులో ఎ1 గా అనిల్ను,త ఎ2గా రాజయ్యను, ఎ3గా మాధవిని, ఎ4గా సనను చేర్చారు. దసరా రోజు అనిల్, తన రెండో భార్య సనతో కలిసి వచ్చి సారికను బెదిరించినట్లు చెబుతున్నారు.

పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి - అనిల్ రెండో వివాహంతోనే సారికపై వేధింపులు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అనిల్కు తల్లిదండ్రుల మద్దతు ఉంది. సారికను మామ రాజయ్య, అత్త మాధవీ లత వేధించారు. ఆమె పలుమార్లు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఆత్మహత్య చేసుకోవాలని సారికపై ఒత్తిడి పెట్టారు. ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు ఈ వేధింపులకు సాక్షులు.
సారికను, పిల్లలను అత్తింటివారు ఒంటరి చేశారు. ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే వేధింపులు పెరుగుతాయని సారిక భయపడింది. పలుకుబడి ఉపయోగించి వేధిస్తారని భయపడింది. విసిగిపోయి ఆత్మహత్యకు ఒడిగట్టింది.
ఇంట్లోంచి పొగలు రావడంతో చుట్టుపక్కలవాళ్లు గుర్తించి 100, 108లకుస సమాచారం ఇచ్చారు. ఆ ఇంటి బెడ్రూంలో రెండు గ్యాస్ సిలిండర్లున్నాయి. వాటిలో ఒక్కటి ఖాళీది కాగా, మరోటి నిండుది. మంటలు, పొగ కారణంగానే సారిక, పిల్లలు మరణించారు. తాను చనిపోతే పిల్లలు దిక్కులేనివారవుతారనే ఉద్దేశంతో సారిక వారిని కూడా లేకుండా చేసిందని అంటున్నారు.
ఇదిలావుంటే, వరంగల్ కోర్టులో రాజయ్య, ఆయన భార్య మాధవి శనివారంనాడు వరంగల్ కోర్టులో బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. సంఘటన జరిగిన ఇంట్లో తాము ఉండడం లేదని, ఎన్నికల నేపథ్యంలోనే తాము ఒక్క రోజు ముందుగా అక్కడికి వచ్చామని వారు అందులో చెప్పారు. అందువల్ల ఘటనతో తమకు ఏ విధమైన సంబంధం లేదని అంటూ తమకు బెయిల్ ఇవ్వాలని వారు కోరారు. వారి పిటీషన్పై విచారణను కోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications