రైల్వే శాఖ వార్నింగ్.. సంక్రాంతి సీజన్ లో ఇలా చేస్తే ప్రాణాలకే ముప్పు..
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తుంటారు. అయితే తాజాగా రైల్వే శాఖ కీలక విజ్ఞప్తి చేసింది. రైల్వే విద్యుత్తు లైన్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దని సూచనలు చేసింది. అలాగే విద్యుత్తు తీగల నుండి వేలాడుతున్న గాలిపటం దారాలను తాకడాన్ని నివారించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రైల్వే ప్రాంగణాల పరిసరాల్లో, యార్డులు, ట్రాక్లు, సమీపంలోని జనసంచార ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేయడం వల్ల అనేక విద్యుదాఘాతానికి గురైన సంఘటనలు సంభవించాయని దక్షిణ మధ్య రైల్వే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మునుపటి సంక్రాంతి పండుగ సీజన్లో ఇలాంటి సంఘటనలు భారతీయ రైల్వేలోని అనేక జోన్ లలో, కొన్ని కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇందులో వ్యక్తులు 25 కె. వి ట్రాక్షన్ ఓవర్ హెడ్ కండక్టర్ లలో చిక్కుకున్న గాలిపటం దారాలను తాకడంతో విద్యుత్ షాక్ లు లేదా ప్రాణాంతక గాయాలకు గురయ్యారని తెలిపింది.
సాధారణంగా ప్రజలు ఉపయోగించే చైనా నుండి దిగుమతి చేసిన గాలిపటాల దారాలు, విద్యుత్ వాహకం అవడంవలన అవి ప్రాణాలకు మాత్రమే కాకుండా కీలకమైన రైల్వే విద్యుత్ మౌలిక సదుపాయాలకు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. దీని వలన ప్రయాణీకులకు అలాగే రైల్వే సిబ్బందికి.. రైల్వే సేవలకు అంతరాయనికి, ప్రమాదాలకు దారితీయవచ్చని స్పష్టం చేసింది.

ఈ విషయంలో.. రైల్వే ట్రాక్ లు, స్టేషన్లు, యార్డులు, ఇతర రైల్వే సంస్థాపనల దగ్గర గాలిపటాలు ఎగురవేయడాన్ని ఖచ్చితంగా నివారిస్తూ ప్రజలు తమ పూర్తి సహకారాన్ని అందించాలని దక్షిణ మధ్య రైల్వే హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసింది. ఓవర్ హెడ్ ట్రాక్షన్ లైన్లు అధిక వోల్టేజ్ విద్యుత్ తో ఛార్జ్ చేసినందువల్ల, వాటిని తాకినప్పుడు పెను ప్రమాదం కలిగిస్తాయని తెలియజేసింది.
ఈ మేరకు ప్రతి ఒక్కరూ పండుగలను బాధ్యతాయుతంగా, క్షేమంగా జరుపుకొంటూ నిరంతర రైలు కార్యకలాపాలను సజావుగా కొనసాగించడంలో సహాయపడాలని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications