నామినేషన్లో గందరగోళం: చివరి నిమిషంలో జంపింగ్, అమ్మయ్య... టిక్కెట్ దక్కింది!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. కొన్ని నియోజకవర్గాల్లో చివరి వరకు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయలేదు. కొందరు ఇండిపెండెంట్లు ఆర్వోలను ఇబ్బంది పెట్టారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి రెబల్స్ బెడద తప్పేలా లేదు. పలువురు రెబల్స్ పోటీలో నిలబడ్డారు. మహాకూటమికే రెబల్స్ తలనొప్పి ఎక్కువగా ఉంది. కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి పలు చోట్ల పోటీ చేస్తోంది. పొత్తులో ఇతర పార్టీకి వచ్చిన స్థానంలోను మరో పార్టీ తమ అభ్యర్థికి బీఫారం ఇచ్చింది.
నామినేషన్ ప్రక్రియకు ముందు పలు ఆసక్తికర సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అప్పుడే పార్టీలోకి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడం, కూటమిలోని ఓ పార్టీ స్థానంలో మరొక పార్టీ బీఫాం ఇవ్వడం చోటు చేసుకున్నాయి. చివరి నిమిషంలో పార్టీలో చేరిన పలువురు నేతలు ఇతర పార్టీలలో టిక్కెట్లు దక్కించుకున్నారు.

తెరాస, బీఎల్పీ పార్టీల తరఫున
తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మల్లయ్య యాదవ్ కోదాడ టిక్కెట్ ఆశించారు. కానీ అది దక్కలేదు. దీంతో ఆయన తెరాసలో చేరి చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు. కొత్తగూడెం టిక్కెట్ ఆశించిన యడవల్లి కృష్ణ కాంగ్రెస్ పార్టీలో రాకపోవడంతో పార్టీ మారి బీఎల్పీ అభ్యర్థి అయ్యారు. బోడ జనార్ధన్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీఎల్పీ తరఫున పోటీ చేస్తున్నారు. మధిర తెరాస టిక్కెట్ ఆశించిన రాంబాబు ఆ తర్వాత బీఎల్పీ అభ్యర్థి అయ్యారు.

బీజేపీ నుంచి టిక్కెట్లు వచ్చాయి
జుక్కల్లో కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసిన మాజీ ఎమ్మెల్యే అరుణతార చివరకి బీజేపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. తెరాసలో టిక్కెట్ ఆశించి భంగపడిన నటుడు బాబూమోహన్ కూడా కమలం పార్టీ నుంచి ఆందోల్ టిక్కెట్ సంపాదించారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన రాజేశ్వరరావు దేశ్పాండే సంగారెడ్డి నుంచి బరిలో నిలిచారు. పీసీసీ కార్యదర్శి వెంకట్ రెడ్డి పార్టీ మారిన రోజే బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. అతను కోరుట్ల నుంచి బరిలో ఉన్నారు. తెరాస తరఫున చొప్పదండి టిక్కెట్ ఆశించిన బొడిగె శోభ బీజేపీలో చేరారు. రెండ్రోజుల్లో ఆమె బీజేపీ అభ్యర్థఇ అయ్యారు.

కాంగ్రెస్ నుంచి టిక్కెట్
ఖానాపూర్ నుంచి టిక్కెట్ కోసం రమేష్ రాథోడ్ తెరాసలో చేరారు. అక్కడ టిక్కెట్ రాకపోవడంతో కాంగ్రెస్లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేఎస్ రత్నం ఇటీవలె కాంగ్రెస్లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. దేవరకొండకు చెందిన బాలూనాయక్ టిక్కెట్ కోసం తెరాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దక్కించుకున్నారు. ఈయన అంతకుముందు కాంగ్రెస్ నేత. పార్టీలో కూడా కొందరు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఉదారహణకు కూకట్పల్లి నుంచి టీడీపీ తరఫున పెద్దిరెడ్డి, మందాడి పేర్లు వినిపించాయి. కానీ సుహాసిని పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

కేటాయించిన సీట్ల కంటే ఎక్కువ చోట్ల తెజస నామినేషన్
తెలంగాణ జన సమితి పొత్తులో భాగంగా తమకు కేటాయించిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్ వేసింది. తెజసకు 8 స్థానాలను కాంగ్రెస్ కేటాయించింది. వీటికి అదనంగా మరి కొన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.












Click it and Unblock the Notifications