లక్ష ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయండి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని పేర్కొంది హైకోర్టు. అంతేగాక, ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశంచింది.
భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని.. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా నియంత్రణపై సోమవారం తెలంగాణ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఏజీ వెల్లడించారు. పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.
హైకోర్టులో మంగళవారం వర్చువల్గా కేసుల విచారణ.. ఆన్లైన్లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్నట్లు తెలిపింది. కొవిడ్ వ్యాప్తి వల్ల మళ్లీ వర్చువల్ విచారణలు జరపనుంది. తదుపరి విచారణను జనవరి 25కు వాయిదా వేసిన హైకోర్టు.
జనవరి 2 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. జవనరి 12 వరకు మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 6.95 పాజిటివిటీ రేటు నమోదైంది. అలాగే జీహెచ్ఎంసీలో 5.65 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్లు అధికారులు తమ రిపోర్టులో కోర్టుకు నివేదించారు.
ఇది ఇలావుండగా, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కోవిడ్ కేసుల కలకలం రేపింది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 12 మంది పోలీసులకు కరోనా సోకింది. యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, మరో 10 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. దీంతో వీరంతా ప్రస్తుతం హోంఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారులు కరోనా నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా, తెలంగాణలో గత కొద్ది రోజులుగా ప్రతిరోజూ 2వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 20వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.