మోడీ, కేసీఆర్లను నమ్మితే..: సిద్దరామయ్య తీవ్ర విమర్శలు
కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కర్ణాటక సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన అనంతరం జరిగిన సభలో సిద్దరామయ్య మాట్లాడారు. గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ ఓడిపోతారని అన్నారు.
తెలంగాణలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఓట్లు కొనాలని చూస్తున్నారని.. బీఆర్ఎస్ సర్కారును ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని సిద్దరామయ్య అన్నారు. కామారెడ్డి, కోడంగల్లోనూ రేవంత్ రెడ్డి విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ వందసార్లు వచ్చినా.. బీజేపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు సిద్దరామయ్య. బీజేపీకి నాలుగు స్థానాలకు మించి రావన్నారు. బీజేపీ నాయకులు మోడీపై విశ్వాసంతో పోటీ చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో మోడీ కర్ణాటక రాష్ట్రంలో 48 సార్లు పర్యటించారని.. రోడ్షోలు, సభల్లోప్రసంగించారని.. ఆయన పర్యటించిన సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వచ్చిందని చెప్పారు.
మోడీ, కేసీఆర్ చెప్పే అబద్ధాలను తెలంగాణ ప్రజలు నమ్మవద్దని సిద్దరామయ్య కోరారు. కేసీఆర్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోతారన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
బీసీ డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలు:
కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు. కొత్తస్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కు పెంపు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్.
బీసీ సబ్ ప్లాన్ కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు. బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు.

ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ. అన్ని బీసీకులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు. బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీలేని రుణాలు. అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీసర్కిల్, లైబర్రీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు. బీసీ ఐక్యత భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు.
"వృత్తి బజార్" పేరుతో ప్రతీ మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పా టు చేసి.. మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతివృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేత. గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును.. మిగిలిన అన్ని చేతివృత్తులు చేపట్టేవారికి వర్తింపు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతీ సొసైటీకి ఎన్నికల నిర్వహణ, రూ.10 లక్షల ఆర్థికసహాయం.
వివిధ సామాజిక వర్గాలకు హామీలు ముదిరాజ్, ముత్రాసు, తెనుగోళ్ల సామాజిక వర్గాలను BC-D నుంచి BC-Aలోకి చేర్చడం. అధికారంలోకి వచ్చి న 100 రోజుల్లోనే గొల్లకురుమలకు 2వ దశ గొర్రెల పంపిణీ. తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పా టు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ. జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలలో మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు.
పద్మశాలీలకు పవర్ లూమ్స్, పరికరాలపై 90% సబ్సిడీ.మంగలి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు.పట్టణ ప్రాంతాల్లో షాపులు ఏర్పాటుకు భూమి కేటాయింపు.రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.10 లక్షలు.రాష్ట్రవ్యాప్తంగా దోబీ ఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతీ జిల్లాకు రూ.10 కోట్లు కేటాయింపు.
ప్రతీ మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతీ జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల.రూ.3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకులతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్.












Click it and Unblock the Notifications