వైభవ్ సూర్యవంశీ కోసం వరల్డ్ కప్ హీరోను ఎలా పక్కన పెట్టాలనిపించింది: మంజ్రేకర్
మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియాపై ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ ఉత్కంఠ పోరులో జాకబ్ బెథెల్ 46 బంతుల్లో 76 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, ఈ విజయంతో అయిదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే కొట్టి అవతలపడేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ- 43, ఇషాన్ కిషన్- 49 పరుగులు చేశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో 37 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ నూతన రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే టీ20 ఇంటర్నేషనల్స్ లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్టు హోదా ఉన్న దేశాల్లో అత్యంత చిన్న వయసులో టీ20 మ్యాచ్ ఆడిన క్రికెటర్గా చరిత్ర పుటల్లోకెక్కాడు.

ఈ మ్యాచ్ లో అతను నిరాశపరిచాడు. 10 బంతుల్లో రెండు సిక్సర్లతో 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. వైభవ్ కోసం టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాను గెలిపించిన సంజు శాంసన్ ను పక్కన పెట్టాల్సొచ్చింది. ఈ పరిణామం విమర్శలకు దారి తీసింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ను తుదిజట్టు నుంచి తప్పించడం వివాదానికి తెరలేపింది. టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన శాంసన్ ను, రెండు మూడు ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడనే నెపంతో పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సంజూ శాంసన్ను తుది జట్టు నుంచి తొలగించడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా స్పందించాడు. శాంసన్ కు ఏదైనా గాయమైందా? అని ప్రశ్నించాడు. తుదిజట్టు ఎంపిక చాలా వింతగా అనిపించిందని వ్యాఖ్యానించాడు. ఒకవేళ వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకున్నప్పటికీ, శాంసన్ను మూడో స్థానంలో ఆడించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అతన్ని ఈ క్లిష్ట సమయంలో సెలెక్టర్లు సపోర్టింగ్ ఉండాలని మంజ్రేకర్ పేర్కొన్నాడు.
టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా జట్టు వ్యూహాత్మక లోపాన్ని ఎత్తిచూపాడు. ప్రస్తుతం జట్టులోని టాప్ సిక్స్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఒకే శైలి కలిగిన ఎడమచేతి వాటం బ్యాటర్లు వరుసగా ఉండటం వల్ల ప్రత్యర్థి బౌలర్లకు ప్రణాళికలు రచించడం సులువవుతుందని, ఇది జట్టు బ్యాటింగ్ బలహీనతలకు కారణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు.












Click it and Unblock the Notifications