భారత్ vs పాకిస్థాన్.. ఆ విషయంలో నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా..!
గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 నివేదిక విడుదలైంది. ఈ అంతర్జాతీయ సూచీలో భారత్ కు కొంత నిరాశే ఎదురైందని చెప్పాలి. గత ఏడాది కంటే భారత పాస్ పోర్ట్ ఈ సారి ఒక స్థానాన్ని కోల్పోయింది. 2025 లో 124 వ స్థానంలో నిలిచిన భారత్, ప్రస్తుత ఏడాది 125 వ ర్యాంకుకు పడిపోయింది. 2021 లో 127 వ ర్యాంకుతో ఉన్న భారత్ క్రమంగా కోలుకున్నప్పటికీ, అత్యంత ప్రతిష్టాత్మకమైన టాప్ 100 దేశాల జాబితాలోకి మాత్రం ప్రవేశించలేకపోయింది.
ఈ తాజా సూచీ ప్రకారం.. భారత పాస్ పోర్ట్ కలిగిన వారు కేవలం 26 గమ్య స్థానాలకు మాత్రమే ముందస్తు వీసా లేకుండా ప్రయాణించే వీలుంది. ఇందులో భూటాన్, నేపాల్, జమైకా, మకావు, ట్యునీషియా వంటి దేశాలు ఉన్నాయి. వీటికి భారతీయులు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో వెళ్లొచ్చు. అయితే, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యూఏఈ వంటి దాదాపు 88 దేశాలకు వెళ్లాలంటే మాత్రం భారతీయులకు తప్పనిసరిగా ముందస్తు వీసా అవసరమవుతుంది.
పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ స్థానం ఎలా ఉంది..?
దక్షిణాసియా పొరుగు దేశాలతో పోల్చి చూస్తే భారత్ చాలా దేశాల కంటే మెరుగైన స్థానంలోనే ఉంది. ఈ సూచీలో బంగ్లాదేశ్ 166వ స్థానంలో, నేపాల్ 164వ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ అత్యంత దిగువన 188వ స్థానంలో నిలిచింది. అయితే చైనా మాత్రం 104వ స్థానంతో భారత్ కంటే చాలా ముందుంది. కాగా, నమీబియా, పిలిప్పీన్స్, మొరాకో, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల కంటే కూడా భారత పాస్ పోర్ట్ బలహీనంగా ఉండటం గమనార్హం.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టులు
గ్లోబల్ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2026 అంతర్జాతీయ ప్రయాణ సౌలభ్యాన్ని బట్టి ఈ ర్యాంకులను నిర్ణయించింది. ఈ జాబితాలో మొదటి పది స్థానాల్లో యూరోప్ దేశాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, జర్మనీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగిన అమెరికా, ఫ్రాన్స్ దేశాలు త్రుటిలో టాప్ 10 అవకాశాన్ని కోల్పోయి సంయుక్తంగా 11వ స్థానానికి పరిమితం అయ్యాయి.












Click it and Unblock the Notifications