గ్రూప్ 1 అక్రమాలపై చంద్రబాబు షాకింగ్..! ఎలక్ట్రీషియన్లతో దిద్దించారు, వాట్సాప్ లో..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 (APPSC Group 1) పరీక్ష జవాబు పేపర్ల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు (Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని, వాల్యూషన్ అంతా ఏపీపీఎస్సీ కార్యాలయం పరిధిలో జరగాల్సి ఉండగా.. మొదట డిజిటల్ వ్యాల్యూషన్ హైదరాబాద్లో ప్రైవేట్ వారితో చేయించారని, రెండో సారి హాయిల్యాండ్లో మాన్యువల్ వాల్యూషన్ చేయించారని ఆరోపించారు.
కోర్టుకు కూడా డిజిటల్ పద్ధతిలో వాల్యూషన్ చేసినట్లు అబద్ధాలు చెప్పాలని వైసీపీ హయాంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మూడోసారి సర్వీస్ కమిషన్ ఆఫీస్లో వాల్యూషన్ చేసినా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్స్, డ్రైవర్స్, భవన నిర్మాణ కార్మికులు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారని ఆరోపించారు. నాటి ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్సార్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గానూ పని చేశారని, అప్పటి ఏపీపీఎస్సీ ఛైర్మన్ను కట్టడి చేసి బయటకు రాకుండా చేశారని విమర్శించారు. హైదరాబాద్లోని తన స్నేహితుడు ఎండీ స్టోన్ మీడియా ఎండీ శ్రీనివాసరావుకు గ్రూప్-1 పేపర్లు దిద్దే బాధ్యతను పీఎస్ఆర్ అప్పగించారని, కూరగాయల మార్కెట్లకంటే దారుణంగా వాట్సాప్ గ్రూపులు పెట్టి మూల్యాంకనం చేసే వారిని నియమించారన్నారు.

ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్ నుంచి అనధికారికంగా జవాబు పత్రాలను తరలించి 84 రోజుల పాటు హాయ్ లాండ్లో ఉంచారన్నారు.
ఎవాల్యుయేషన్ హాయ్ లాండ్లో చేయలేదని హైకోర్టులో అఫిడవిట్ వేశారని, అదే సమయంలో లాజిస్టిక్స్ కోసం 1.14 కోట్లు ఖర్చు చేశారని, ఇది పూర్తిగా బరితెగించటమే అన్నారు. 2022 మార్చి 9న డేటా టెక్ మెథడాక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 49 వేల డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్లు, 2,500 కంట్రోల్ బండిల్స్ స్లిప్స్ ముద్రించారని, అందులో 48,442 మాత్రమే తిరిగివచ్చాయన్నారు.
ఎగ్జామినర్ల వివరాలు వాట్సాప్, టెలీగ్రామ్లో తెలిసిపోయాయని, అందులో 47 మంది మూల్యాంకనానికి వెళ్లారన్నారు. తన వద్దకు వచ్చి గ్రూప్-1 పరీక్షల పేపర్లకు మార్కులు వేయాలని అడిగినట్లు వనజ అనే పొలిటికల్ సైన్స్ లెక్చరర్ తెలిపారన్నారు.

గ్రూప్-1 పరీక్షా పేపర్లపై రకరకాల చేతి రాతలు ఉన్నాయని, దీనికి సంబంధించి ఫారెన్సిక్ ల్యాబ్లోనే ఆధారాలు లభించాయన్నారు. 734 అభ్యర్థుల ఓఎంఆర్ స్లిప్స్లో 718 స్లిప్స్లో మార్పులు చేర్పులు జరిగాయని, దీన్ని పరీక్ష అంటారా.? 21 స్లిప్స్పై ఎలాంటి సంతకాలూ లేకపోవటం ఈ అక్రమాలకు పరాకాష్ట అని చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. భవిష్యత్తులో తప్పులు చేయాలంటే భయపడేలా శిక్షలు విధిస్తామన్నారు. యువత ప్రతిభను గుర్తిస్తామని... ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగ్గకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.














Click it and Unblock the Notifications