ఫిలింనగర్లో ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్, 'సిరిబాబును ఎక్కడకి తరలించారు'
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఫిలిం నగర్లో ఆరేళ్ల చిన్నారి శనివారం అపహరణకు గురయింది. పాఠశాల ముందు ఆడుకుంటున్న చైతన్య హరిణిని ఓ గుర్తు తెలియని మహిళ చిరునామా కావాలని అడిగి, తీసుకు వెళ్లింది.
ఆకుపచ్చ చుడీదారులో వచ్చిన 21 ఏళ్ల అమ్మాయి పూజిత అనే యువతి ఇళ్లు చూపించాలని అడిగి హరిణిని తీసుకు వెళ్లినట్లు తోటి విద్యార్థులు చెప్పారు. తమ పాపను తిరిగి అప్పగించాలని, తాము ఏ డిమాండ్ చేసినా దానిని నెరవేరుస్తామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
తమ పాపను అప్పగించాలని, మీకు ఏమైనా కావాలంటే తనకు ఫోన్ చేయాలన్నారు. తమ పాపకు ఎలాంటి హాని తలపెట్టవద్దని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
సిరిబాబును గాంధీ నుంచి ఎక్కడికి తరలించారు: బిసి సంఘం
బిసి సంఘం నేత సిరిబాబును ఎక్కడకు తరలించారో చెప్పాలని బిసి సంఘం రాష్ట్ర నాయకుడు బీరయ్య యాదవ్ ఆదివారం డిమాండ్ చేశారు. సిరిబాబుకు ఏం జరిగినా సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావులదే బాధ్యత అన్నారు.
ఆత్మహత్యాయత్నం చేసుకున్న సిరిబాబును పోలీసులు బలవంతంగా యశోదా ఆసుపత్రి నుంచి గాంధీకి తీసుకు వెళ్లారని, అక్కడి నుంచి మరోచోటుకు తీసుకు వెళ్లారని ఆరోపించారు. వెంటనే వివరాలు తెలపకుంటే రేపటి నుంచి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఫీజుల పేరుతో దోచుకుంటున్న ప్రయివేటు స్కూళ్లను నియంత్రించాలన్నారు.
ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలంటూ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం మెదక్ జిల్లాలో చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తత ఏర్పడింది. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని శ్రీచైతన్య పాఠశాల ముందు బిసి నేతలు ధర్నా చేశారు. వారు స్పందించక పోవడంతో సిరిబాబు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నారు.
మంటలకు తాళళేక పక్కనే రోడ్డుపై నిలిచి ఉన్న వర్షపు నీటిలో పడి విలవిల్లాడాడు. పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 30-40 శాతం కాలిన గాయాలతో అతనిని ఆసుపత్రికి తరలించారు. శనివారం నాడు యశోదా ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆర్ కృష్ణయ్య వచ్చి పరామర్శించారు.