టోపీ ధరించి వచ్చిన ఎస్పీ:ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: పాలమూరు జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ పైన సోమవారం నాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక మాఫియా కేసు విచారణలో భాగంగా ఎస్పీ ఉదయం హైకోర్టులో హాజరయ్యారు.
ఆయన టోపీ ధరించి కోర్టుకు హాజరు కావడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో టోపీ ధరించకూడదని మీకు తెలియదా? అని ఎస్పీని ప్రశ్నించారు. న్యాయస్థానంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని మందలించారు.
ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదాపై విచారణ
ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదా వ్యవహారంలో హైకోర్టులో విచారణ జరిగింది. నల్గొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ప్రభుత్వం 14 మంది సలహాదారులను నియమించినట్లు హైకోర్టుకు ఏజీ వివరించారు. సలహాదారులకు కేబినెట్ హోదా ఇవ్వలేదని, కేవలం సదుపాయాలు మాత్రమే కల్పించామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను హైకోర్టు వారం రోజులు వాయిదా వేసింది.
అర్చకుల ఆందోళన పైన ఇంద్రకరణ్ రెడ్డి
అర్చకుల ఆందోళనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ సమయంలో దీనిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం స్పందించారు.
అర్చకుల డిమాండ్ల పైన ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. కమిటీ నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అర్చకులు గోపురాలు ఎక్కి ఆందోళన చేయడం ఏమిటన్నారు. పద్ధతి ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు.
శ్రీనిధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష
శ్రీనిధిపై అధికారులతో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమీక్ష నిర్వహించారు. పేదలకు శ్రీనిధి ఆర్థిక సేవలు అందేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రుణ వితరణ సహా బీమా సేవలు అంశాన్ని అధికారులు పరిశీలించాలని సూచించారు. 2015-16 సంవత్సరంకు గాను రూ.1050 కోట్లు రుణ లక్ష్యం నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. వెనకబడిన కుటుంబాలు స్వయం ఉపాధి పొందేలా ప్రణాళికలుండాలన్నారు.