వరంగల్ లో రోడ్డెక్కిన విద్యార్థులు.. ట్రాఫిక్ జామ్!
వరంగల్ నగరంలో ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ములుగు రోడ్డు దగ్గర ఉన్న పెద్దమ్మ గడ్డ కాకతీయ కెనాల్ సమీపంలోని ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు తమకు చదువు చెప్పేందుకు సరైన అధ్యాపకులు లేరని ఆందోళన చేశారు. తరగతులను బహిష్కరించి రోడ్డుపైన బయట నుంచి నిరసన చేపట్టారు.
అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థుల ఆందోళన
సంవత్సరం అంతా సరైన అధ్యాపకులు లేకపోవడంతో తరగతులు సరిగా జరగలేదని, ఈ పరిస్థితిలో తమ భవిష్యత్తు ఏమిటో చెప్పాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకుల నియామకం జరగకపోవడంతో విద్యా సంవత్సరం వృధా అవుతుందని విద్యార్థులు ఆరోపించారు. ఇప్పటికే పరీక్షల సమయం దగ్గర పడుతున్నా బోధన లేకపోవడంతో తమ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వారి పేర్కొన్నారు.

ములుగు రోడ్డు పైన బైఠాయించి విద్యార్థుల నిరసన
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమ ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడానికి నిరసన వ్యక్తం చేయడమే ప్రత్యామ్నాయ మార్గంగా భావించిన విద్యార్థులు ములుగు రోడ్డు పైన బైఠాయించి నిరసన చేపట్టారు. అధ్యాపకులు కావాలి.. భవిష్యత్తును కాపాడాలి ట్రైబల్ విద్యార్థుల హక్కులను కాపాడండి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

విద్యార్థుల ఆందోళనతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది
జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆందోళన కారణంగా ములుగు రోడ్డుపైన భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అధికారులతో చర్చలు జరిపి సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
ట్రైబల్ విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోవాలని వినతి
స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు తాము ఆందోళనలు చేసి తీరుతామని విద్యార్థులు చెబుతున్నారు. ట్రైబల్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వ నిర్లక్ష్యం చేయకూడదని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలను పట్టించుకోవాలని, తక్షణం అధ్యాపకులను పంపాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications