‘కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి భూ మండలంలోనే లేరు’
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై శారదా పీఠాధీశ్వరులు స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి భూమండలంలోనే లేరని కొనియాడారు. వరంగల్లో భద్రకాళి దేవాలయాన్ని గురువారం సాయంత్రం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్.సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషుల ఆధ్వర్యంలో వేద స్వస్తి, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామి భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, మహాహారతి ఇచ్చారు. శారదా వేద ఆస్థాన విద్వాంసులు శ్రీకృష్ణశర్మ సమయాచార పద్ధతిలో సంకలనం చేసిన శ్రీచక్రార్చన గ్రంథాన్ని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు దంపతులతో కలిసి ఆవిష్కరించారు.
ధర్మబద్ధమైన జీవనంతోనే ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లుతారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గొప్ప దార్శనికుడు, ఆధ్యాత్మికవేత్తగానూ పేరుగాంచారని కొనియాడారు.
అమ్మవారికి దుర్గాష్టమి నాడు ముఖ్యమంత్రి బంగారు ఆభరణాలు సమర్పించి తెలంగాణ ప్రజలకు శాశ్వతమైన పుణ్యాన్ని ప్రసాదించారని కొనియాడారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో నిత్యం ధూప, దీప నైవేద్యాలు జరగాలని, ఇందుకోసం చేపట్టే ప్రత్యేక కార్యక్రమానికి భద్రకాళి అమ్మవారి సన్నిధి నుంచే శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.