షాక్: కెసిఆర్ ఇలాకాలో టిడిపి సభ్యులెంత మందో తెలిస్తే...
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా మిగిలిపోతుందనే విషయాన్ని సభ్యత్వ నమోదు కార్యక్రమమే తెలియజేస్తోంది. కెసిఆర్ శాసనసభా నియోజకవర్గంలో టిడిపి సభ్యుల సంఖ్య తెలిస్తే అవాక్కయ్యే పరిస్థితి...
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా మిగిలిపోతుందనే విషయాన్ని సభ్యత్వ నమోదు కార్యక్రమమే తెలియజేస్తోంది. కెసిఆర్ శాసనసభా నియోజకవర్గంలో టిడిపి సభ్యుల సంఖ్య తెలిస్తే అవాక్కయ్యే పరిస్థితి...
హైదరాబాద్: తనకు సాటి లేరని చాటుకున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఎదురవుతోంది. తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇలాకాలో టిడిపి సభ్యుల సంఖ్య తెలిస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో ఇద్దరంటే ఇద్దరే టిడిపి సభ్యులు చేరారు.
గతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించినప్పుడు ఇక్కడ సుమారు 18 వేలమంది పార్టీ సభ్యులుగా ఉన్నారు. తన ఇంట్లో వివాహ శుభకార్యం జరిగినందు సభ్యత్వంపై దృష్టి పెట్టలేకపోయినట్టు ఒంటేరు ప్రతాప్రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వివరణ ఇచ్చినట్టు తెలిసింది.
సభ్యత్వ నమోదుకు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులకు లక్ష్యం నిర్దేశించి నెల రోజులు గడుస్తోంది. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. దీంతో అధిష్టానం మరో 15 రోజులు గడువు పెంచింది. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ఇప్పటివరకు మూడున్నర లక్షలకు మించి తెలంగాణలో సభ్యత్వ నమోదు జరగలేదని మీడియాలో వార్తలు వచ్చాయి మరో వారంరోజుల్లో ఇచ్చిన గడువు ముగుస్తోంది. ఈలోగా అధిష్టానం నిర్దేశించిన 8 లక్షల లక్ష్యం నెరవేరడం గగనమే అనిపిస్తోంది.
ఇప్పటి వరకు 28 నియోజకవర్గాలకు ఇంతవరకు ఇన్ఛార్జీలు లేరు. ఒకప్పడు టిడిపి గ్రేటర్ హైదరాబాదులో తిరుగు ఉండేది కాదు. కానీ ఇప్పుడు సభ్యత్వ నమోదు అత్యంత క్లిష్టంగా మారింది. టిడిపికి కంచుకోటలుగా భావించే కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ లాంటి నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి దిగదుడుపుగానే ఉంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గతంలో దాదాపు 20 వేల వరకు సభ్యత్వం జరిగింది. ప్రస్తుతం ఆ సంఖ్య రెండువేలకు మించలేదని మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్లలో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. పాత జిల్లాల ప్రాతిపదికన చూసుకుంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ వంటి జిల్లాలలో సభ్యత్వం ఫరవాలేదనించేలా ఉందని అంటున్నారు.