తెలంగాణలో ఇక మేమే: నారా లోకేష్ జోష్, ట్యాపింగ్పై వ్యాఖ్యలు
హైదరాబాద్: తమ పార్టీ నాయుకలు ఫోన్లను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం ట్యాపింగ్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ అధికారులు సజ్జనార్, శివధర్రెడ్డి స్వయంగా సంతకం చేసి సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చిన రెండు కాపీలు కూడా ఉన్నాయని, ఆ ఆధారాలను సరైన సమయంలో బయటపెడతామని ఆయన అన్నారు. మంగళవారం ఆయనిక్కడ ఎన్టీఆర్భవన్లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణలో తమ పార్టీ క్యాడర్ పటిష్ఠంగా ఉందని, ఎవరూ పట్టించుకోకపోయినా 4 ఎంపీటీసీలు కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో టిఆర్ఎస్కు పోటీనిచ్చేది టీడీపీయేనని నేతలకు చెప్పారు. ఎంపీటీసీ ఎన్నికలకు స్వయంగా టీఆర్ఎస్ మంత్రులు క్యాంపులు నిర్వహించారని, అక్రమ కేసులు, అరెస్టులు అంటూ కేసీఆర్ ప్రభుత్వం తమ పార్టీ కేడర్ను భయపెడుతోందని ఆయన అన్నారు.
ఇలాంటి సమయంలో 4 ఎంపీటీసీలు గెలుచుకోవటం చాలా గొప్ప విషయమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు మన సొంతమవుతాయని ఆయన అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నారా లోకేష్ పార్టీ నేతలను, కార్యకర్తలకు లోకేశ్ పిలుపునిచ్చారు.
ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చొప్పున నియోజకవర్గంలో 200 మంది కార్యకర్తలను ఎంపిక చేసి త్వరలో శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చాటిచెప్పాలని నేతలకు సూచించారు.












Click it and Unblock the Notifications