'కడియంని బర్తరఫ్ చేయాలి', ఎంసెట్ లీకేజీలో ప్రింటింగ్ సంస్థ ఉద్యోగి
హైదరాబాద్: ఎంసెట్ 2 ప్రశ్నాపత్రాల లీకేజీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మా రెడ్డిలను కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్ రమణ, వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు శుక్రవారం నాడు డిమాండ్ చేశారు.
వారుఈ రోజు రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. విపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వారు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అడ్డగోలుగా భూసేకరణ చేస్తోందన్నారు.
2013 భూసేకరణ చట్టం అమలుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులను వెంటనే తొలగించాలన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవడం తెరాస ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. హైకోర్టు 123 జీవోను కొట్టేసినా అప్పీల్కు వెళ్లడం దారుణమన్నారు. ఎంసెట్ 2 లీకేజీతో విద్యార్థులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారన్నారు.
ఎంసెట్ 2 లీకేజీలో ప్రింటింగ్ సంస్థ ఉద్యోగి
ఎంసెట్ 2 ప్రశ్నపత్రం ముద్రించిన ప్రింటింగ్ సంస్థలో పని చేసే ఉద్యోగికి దళారులు డబ్బు ఆశచూపి ప్రశ్నపత్రం రాబట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకుగాను సదరు ఉద్యోగికి రూ.5 లక్షల వరకు ఇచ్చినట్లు తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. దళారులు వ్యూహాత్మకంగా ప్రింటింగ్ సంస్థ ఉద్యోగిని తమవైపు రాబట్టుకున్నారంటున్నారు.